ఆపిల్ ఐఫోన్, ఐప్యాడ్ ధరలు త్వరలోనే పెరగనున్నాయి. ఏఐ డేటా సెంటర్ల డిమాండ్ వల్ల మెమొరీ చిప్స్ కొరత ఏర్పడిందని సీఈఓ టిమ్ కుక్ తెలిపారు.
Photo Credit: apple
apple
Apple : ప్రీమియం స్మార్ట్ఫోన్ లవర్స్కు ఆపిల్ కంపెనీ షాకింగ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే మార్కెట్లో ఐఫోన్లు, ఇతర ఆపిల్ డివైజ్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని లీక్స్ వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఫోన్లలో ఉపయోగించే మెమొరీ, స్టోరేజ్ కాంపోనెంట్ల ధరలు విపరీతంగా పెరగడమేనని తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ల నుంచి వీటికి డిమాండ్ విపరీతంగా పెరగడంతో, సాధారణ వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ వస్తువులకు వాడే చిప్ల కొరత ఏర్పడింది.
ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కీలక వ్యాఖ్యలు
ఇటీవల ది వాల్ స్ట్రీట్ జర్నల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ ఈ ధరల పెరుగుదలపై కీలక విషయాలను వెల్లడించారు. పెరిగిన మెమొరీ, స్టోరేజ్ విడిభాగాల ఖర్చుల భారాన్ని కస్టమర్లపై వేయకుండా ఉండేందుకు కంపెనీ చాలా కాలంగా ప్రయత్నించిందని, కానీ ఇప్పుడు పరిస్థితి చేతులు దాటిపోయిందని ఆయన ఒప్పుకున్నారు. "ధరల పెంపు అనేది ఇక ఎంతమాత్రం నివారించలేనిది. కంపెనీపై ఇన్పుట్ కాస్ట్ భారం విపరీతంగా పెరిగింది. నా 40 ఏళ్ల కెరీర్లోనే ఏ రంగంలోనూ ఇలాంటి అపూర్వమైన సరఫరా సంక్షోభాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఇది వందేళ్లకు ఒకసారి వచ్చే వరద లాంటిది" అని టిమ్ కుక్ వ్యాఖ్యానించారు.
ఐఫోన్ 18 సిరీస్ కంటే ముందే రేట్ల వాత?
బ్లూమ్బెర్గ్ ప్రముఖ జర్నలిస్ట్ మార్క్ గుర్మాన్ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ Xలో చేసిన పోస్ట్ ప్రకారం.. ఆపిల్ తన ఉత్పత్తుల ధరలను పెంచడానికి రాబోయే ఐఫోన్ 18 సిరీస్ వరకు వేచి చూసేలా లేదు. అంతకంటే ముందే మార్కెట్లో ఉన్న ఐఫోన్లు, ఐప్యాడ్లు, మ్యాక్ ల్యాప్టాప్ల ధరలను పెంచాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. అందుకే ఆపిల్ మేనేజ్మెంట్ ఇప్పటికే కస్టమర్లకు అంతర్గతంగా సంకేతాలు ఇవ్వడం ప్రారంభించింది. ఈ నిర్ణయం వల్ల కొత్త ఫోన్ల ధరలు పెరగడమే కాకుండా, సాధారణంగా కొత్త సిరీస్ వచ్చాక తగ్గే పాత మోడళ్ల (ఉదాహరణకు ఐఫోన్ 17 సిరీస్) ధరలపై కూడా ప్రభావం పడనుంది. అంటే పాత ఫోన్లపై ఆశించిన స్థాయిలో డిస్కౌంట్లు దొరకకపోవచ్చు.
Ai+ Nova : భారత మార్కెట్లోకి Ai+ నుంచి రెండు సరికొత్త 5G ఫోన్లు.. తక్కువ ధరలోనే నోవా సిరీస్ హల్చల్
ఏఐ సర్వర్ల వల్లే ఈ ఘోరమైన కొరత
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎన్విడియా, ఓపెన్ ఏఐ వంటి పెద్ద టెక్ కంపెనీలు తమ ఏఐ సర్వర్ల కోసం భారీ ఎత్తున హై-బ్యాండ్విడ్త్ మెమొరీ చిప్లను కొనుగోలు చేస్తున్నాయి. దీంతో చిప్స్ తయారు చేసే శామ్సంగ్, మైక్రాన్ వంటి కంపెనీలు మొబైల్ ఫోన్ల కంటే ఏఐ సర్వర్లకు అవసరమైన భాగాల తయారీకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఫలితంగా మొబైల్స్ లో వాడే LPDDR5X ర్యామ్, NAND ఫ్లాష్ స్టోరేజ్ ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. ఆపిల్ స్వయంగా మెమొరీ చిప్లను తయారు చేసే ఆలోచనలో లేకపోవడంతో, థర్డ్ పార్టీ సప్లయర్స్ పెంచిన రేట్లను భరించడం కంపెనీకి భారం అయిపోయింది.
మొబైల్ తయారీ రంగంపై తీవ్ర ప్రభావం
ఈ మెమొరీ విడిభాగాల ధరల పెరుగుదల కేవలం ఆపిల్పైనే కాకుండా ప్రపంచవ్యాప్త స్మార్ట్ఫోన్ తయారీ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రస్తుత సంవత్సరపు మొదటి త్రైమాసికంలో అంతర్జాతీయంగా స్మార్ట్ఫోన్ల ఉత్పత్తి 1.7 శాతం మేర తగ్గింది. ఈ త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా కేవలం 28.4 కోట్ల మొబైల్ యూనిట్లు మాత్రమే తయారయ్యాయి. వన్ప్లస్, నథింగ్ వంటి బ్రాండ్లు ఇప్పటికే తమ ఫోన్ల ధరలను పెంచగా.. మార్జిన్లు తగ్గకుండా చూసుకోవడానికి ఆపిల్ కూడా త్వరలోనే భారీ రేట్ల పెంపును అధికారికంగా ప్రకటించనుంది. పరిశోధనా సంస్థ టెక్ఇన్సైట్స్ ప్రకారం.. ఆపిల్ తన లాభాల శాతాన్ని కాపాడుకోవాలంటే రాబోయే ఐఫోన్ ప్రో మోడళ్లపై కనీసం 270 డాలర్ల (దాదాపు రూ.22,000) వరకు ధర పెంచాల్సి ఉంటుంది.
ప్రకటన
ప్రకటన
Amazon Great Freedom Sale 2026: Best Deals on Premium Headphones