అంతర్జాతీయ మార్కెట్ నివేదికల ప్రకారం, ప్రపంచంలోని అతిపెద్ద మెమరీ చిప్ తయారీ కంపెనీలు DRAM, NAND ఫ్లాష్ (SSD లలో వాడేది) ధరలను మరోమారు భారీగా పెంచడానికి కసరత్తులు ప్రారంభించాయి.
Photo Credit: Unsplash/ Liam Briese
RAM
RAM Price Hike : మీరు కొత్తగా కంప్యూటర్ అసెంబుల్ చేయించుకోవాలని చూస్తున్నారా? లేదా సరికొత్త ల్యాప్టాప్ కొనడమో, ఉన్న సిస్టమ్లో ర్యామ్ అప్గ్రేడ్ చేయడమో చేయాలనుకుంటున్నారా? అయితే ఈ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవడం మంచిది. ఎందుకంటే రాబోయే రోజుల్లో మెమరీ చిప్స్ కోసం మీరు అదనంగా భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు చేయాల్సి రావచ్చు. అంతర్జాతీయ మార్కెట్ నివేదికల ప్రకారం, ప్రపంచంలోని అతిపెద్ద మెమరీ చిప్ తయారీ కంపెనీలు DRAM, NAND ఫ్లాష్ (SSD లలో వాడేది) ధరలను మరోమారు భారీగా పెంచడానికి కసరత్తులు ప్రారంభించాయి. దీనికి ప్రధాన కారణం ఏఐ సర్వర్లు మరియు భారీ డేటా సెంటర్ల నుంచి వీటికి డిమాండ్ విపరీతంగా పెరిగిపోవడమేనని టెక్ నిపుణులు చెప్తున్నారు.
ధరల పెంపునకు శాంసంగ్ మొండి పట్టు
ప్రముఖ కొరియన్ టెక్ మీడియా ZDNet Korea నివేదిక ప్రకారం.. గ్లోబల్ చిప్ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఈ ఏడాది మూడో త్రైమాసికం (Q3 2026) నుంచి తన కస్టమర్లకు విక్రయించే DRAM సగటు ధరలను ఏకంగా 20 శాతం వరకు పెంచేందుకు చర్చలు జరుపుతోంది. ఈసారి ధరల పెంపు విషయంలో శాంసంగ్ చాలా కఠినంగా, దూకుడుగా వ్యవహరిస్తోందని సమాచారం. స్మార్ట్ఫోన్లలో వాడే LPDDR మెమరీ ధరలు అయితే ఈ 20 శాతం కంటే కూడా ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉంది. కేవలం శాంసంగ్ మాత్రమే కాదు.. ఎస్కే హైనిక్స్, మైక్రాన్ వంటి ఇతర అగ్రశ్రేణి మెమరీ కంపెనీలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి.
సాధారణ పీసీల వాటాకు గండి కొడుతోన్న హెచ్బీఎమ్ మెమరీ ప్రొడక్షన్
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం ఎంత వేగంగా దూసుకుపోతుందో మనకు తెలిసిందే. ఎన్విడియా, ఏఎమ్డీ వంటి కంపెనీలు తయారు చేసే ఏఐ యాక్సిలరేటర్లలో హై బ్యాండ్విడ్త్ మెమరీ చిప్స్ అవసరం చాలా ఉంటుంది. అందుకే ఈ మెమరీ కంపెనీలన్నీ సాధారణ పీసీలు, ల్యాప్టాప్లలో వాడే చిప్స్ ఉత్పత్తిని తగ్గించి.. ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే HBM, సర్వర్ DDR5 చిప్స్ తయారీపైనే పూర్తిగా ఫోకస్ పెట్టాయి. దీనివల్ల మార్కెట్లో నార్మల్ DDR4, DDR5 మెమరీల లభ్యత తగ్గిపోతోంది. మరోవైపు, చైనాకు చెందిన మెమరీ కంపెనీ CXMT కూడా తన ప్రొడక్షన్ టార్గెట్లను తగ్గించుకోవడంతో గ్లోబల్ సప్లై చైన్పై తీవ్ర ప్రభావం పడింది.
QCY MeloBuds : ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 గంటల బ్యాటరీ లైఫ్..మార్కెట్లోకి క్యూసీవై కొత్త వైర్లెస్ ఇయర్బడ్స్
గతేడాదితో పోలిస్తే 100% పెరిగిన DDR5 ధరలు
మరో ప్రముఖ రీసెర్చ్ సంస్థ IPC2U తన నివేదికలో ఆందోళనకరమైన విషయాలను వెల్లడించింది. 2026 లో ర్యామ్ అనేది ఒక సాధారణ హార్డ్వేర్ పార్ట్లా కాకుండా, ఐటీ కంపెనీలకు ఒక వోలటైల్ కాస్ట్ ఫ్యాక్టర్ గా మారిపోయింది. మార్కెట్లోని పలు కంపెనీల DDR5 మెమరీ మోడ్యూల్స్ ధరలు గతేడాదితో పోలిస్తే ఇప్పటికే 100 శాతానికి పైగా పెరిగాయి. కొన్ని రకాల మోడల్స్ ధరలు అయితే ప్రతి వారం మారిపోతున్నాయి. మెమరీ తయారీదారులు ఎక్కువ మార్జిన్ వచ్చే ఎంటర్ప్రైజ్ ప్రొడక్ట్స్కు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల, రిటైల్ మార్కెట్లో సాధారణ కస్టమర్లకు రేట్లు చుక్కలు చూపిస్తున్నాయి.
పాత DDR4 ర్యామ్ పరిస్థితి ఏంటి?
ఈ ధరల పెంపు ప్రభావం కేవలం లేటెస్ట్ DDR5 ర్యామ్లకే పరిమితం కాలేదు. పాత తరం DDR4 మెమరీ ధరలు కూడా నెమ్మదిగా పెరుగుతూ వస్తున్నాయి. ఎందుకంటే చాలా కంపెనీలు పాత DDR4 తయారీని దాదాపు నిలిపివేసి, కొత్త టెక్నాలజీ వైపు షిఫ్ట్ అయిపోయాయి. ముఖ్యంగా డేటా సెంటర్లలో వాడే 96GB, 128GB వంటి హై-కెపాసిటీ సర్వర్ మోడ్యూల్స్ సప్లై చాలా తక్కువగా ఉంది. ప్రముఖ మార్కెట్ విశ్లేషకుల సంస్థ TrendForce అంచనా ప్రకారం.. Q3 2026 లో DRAM కాంట్రాక్ట్ ధరలు 13% నుండి 18% వరకు, అలాగే NAND ఫ్లాష్ ధరలు 10% నుంచి 15% వరకు పెరగవచ్చు. ఇదే ట్రెండ్ గనుక మరికొన్ని రోజులు కొనసాగితే, రాబోయే రోజుల్లో కొత్త ల్యాప్టాప్లు, డెస్క్టాప్లతో పాటు స్మార్ట్ఫోన్ల ధరలు కూడా భారీగా పెరిగే ప్రమాదం ఉంది.
ప్రకటన
ప్రకటన
Huawei Working on Smaller Version of Flagship MatePad Pro Max Tablet, Tipster Claims