ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మెమొరీ, స్టోరేజ్ కాంపోనెంట్స్ (DRAM, NAND స్టోరేజ్) కొరత తీవ్రంగా ఉందని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇటీవల వాల్ స్ట్రీట్ జర్నల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
Photo Credit: apple
iPhone 17
Apple Price Hike : టెక్ దిగ్గజం యాపిల్ తన కస్టమర్లకు ఊహించని షాక్ ఇచ్చింది. గురువారం రోజున ఒకేసారి పలు రకాల డివైజ్ల ధరలను భారీగా పెంచుతూ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఎంట్రీ లెవల్ మ్యాక్బుక్ నియో, ఎమ్5 చిప్లతో కూడిన మ్యాక్బుక్ ఎయిర్, మ్యాక్బుక్ ప్రో ల్యాప్టాప్లతో పాటు ఎమ్4 చిప్తో వచ్చే మ్యాక్ మినీ, పలు ఐప్యాడ్ మోడల్స్, స్మార్ట్ హోమ్ డివైజ్లు ఉన్నాయి. పెరిగిన ఈ కొత్త రేట్లు భారతదేశంతో పాటు ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్కెట్లలో ఇప్పటికే లైవ్లోకి వచ్చేశాయి. ఫ్యూచర్లో యాపిల్ ప్రొడక్ట్స్ ధరల పెంపు తప్పదని ఆ కంపెనీ సీఈఓ టిమ్ కుక్ హింట్ ఇచ్చిన సరిగ్గా వారం రోజులకే ఈ బాదుడు ప్రారంభం కావడం గమనార్హం.
ధరలు పెరగడానికి అసలు కారణం ఇదే
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మెమొరీ, స్టోరేజ్ కాంపోనెంట్స్ (DRAM, NAND స్టోరేజ్) కొరత తీవ్రంగా ఉందని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇటీవల వాల్ స్ట్రీట్ జర్నల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రేట్లు పెంచడం మినహా మరో మార్గం లేదని ఆయన అప్పుడే స్పష్టం చేశారు. నిజానికి ఈ స్టోరేజ్ చిప్లను తయారు చేసే కంపెనీలన్నీ, ప్రస్తుతం ప్రపంచాన్ని ఊపేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి అవసరమైన డేటా సెంటర్ల వైపు తమ సప్లయ్ని మళ్లించాయి. దీనివల్ల సాధారణ ఎలక్ట్రానిక్స్ పరికరాలకు వాడే చిప్ల కొరత ఏర్పడి, తయారీ వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. ఆ భారాన్ని యాపిల్ ఇప్పుడు కస్టమర్లపై వేసింది.
మ్యాక్బుక్ ల్యాప్టాప్ల రేట్లు ఇవే
ఇండియాలో పెరిగిన కొత్త ధరల ప్రకారం.. యాపిల్ బేసిక్ ల్యాప్టాప్ అయిన మ్యాక్బుక్ నియో ధర రూ.10,000 పెరిగి ఇప్పుడు రూ.79,900కి చేరింది. ఇక 13 ఇంచుల మ్యాక్బుక్ ఎయిర్ ఎమ్5 పై ఏకంగా రూ.29,000 పెంచేశారు. అలాగే బేస్ మోడల్ మ్యాక్బుక్ ప్రో పై ఏకంగా రూ.70,000 పెరగడంతో దీని ధర రూ.2,39,900కి ముట్టింది. అన్నిటికంటే ఘోరంగా ఎమ్5 మ్యాక్స్ చిప్సెట్తో వచ్చే టాప్ ఎండ్ మ్యాక్బుక్ ప్రో పై ఏకంగా రూ.1,00,000 ఫ్లాట్ రేట్ పెంచేసింది యాపిల్ కంపెనీ.
![]()
Nothing Phone 4b : నథింగ్ నుంచి సరికొత్త బి సిరీస్ స్మార్ట్ఫోన్.. జూలై 7న నథింగ్ ఫోన్ 4బి లాంచ్
ఐప్యాడ్స్, స్మార్ట్ హోమ్ డివైజ్లపై కూడా పెరిగిన భారం
కేవలం ల్యాప్టాప్లు మాత్రమే కాదు.. ఎమ్4 చిప్తో వచ్చే మ్యాక్ మినీ, 11వ తరం ఐప్యాడ్, లేటెస్ట్ ఐప్యాడ్ మినీ, ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో మోడళ్ల ధరలపై గరిష్టంగా రూ.40,000 వరకు పెంచారు. వీటితో పాటు వినోదాన్ని పంచే యాపిల్ టీవీ 4కే, హోమ్పాడ్, హోమ్పాడ్ మినీ లాంటి స్మార్ట్ హోమ్ ఆడియో డివైజ్ల ధరలను కూడా టిమ్ కుక్ నేతృత్వంలోని యాపిల్ భారీగానే సవరించింది.
ఐఫోన్ 17 సిరీస్, యాపిల్ వాచ్, ఎయిర్పాడ్స్ కొనేవారికి ఊరట
అయితే ఈ ధరల పెంపు గండం నుంచి యాపిల్ తన మోస్ట్ పాపులర్ ఐఫోన్లను ప్రస్తుతానికి తప్పించింది. కొత్త ఐఫోన్ 17 సిరీస్తో పాటు అన్ని రకాల యాపిల్ వాచీలు, ఎయిర్పాడ్స్ ధరలను కంపెనీ టచ్ చేయలేదు. అంటే కస్టమర్లు ఇప్పటికీ పాత ధరలకే వీటిని కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఐఫోన్ 17 బేస్ మోడల్ రూ. 82,900 కి, ఐఫోన్ 17 ప్రో రూ. 1,34,900 కి, ఐఫోన్ 17 ప్రో మాక్స్ రూ. 1,49,900 కి, సరికొత్త ఐఫోన్ ఎయిర్ రూ. 1,19,900 ధరల వద్దే స్థిరంగా ఉన్నాయి. అలాగే ఐఫోన్ 17ఈ రూ. 64,900, ఐఫోన్ 16 రూ. 69,900, ఐఫోన్ 16 ప్లస్ రూ. 79,900 ధరల వద్దే విక్రయించబడుతున్నాయి.
యాపిల్ వాచ్, ఎయిర్పాడ్స్ మోడళ్ల పాత ధరలు
మ్యూజిక్ లవర్స్ ఇష్టపడే ఎయిర్పాడ్స్ 4 బేసిక్ వెర్షన్ రూ.12,900కి, ఏఎన్సీ ఫీచర్ ఉన్న ఎయిర్పాడ్స్ 4 రూ.17,900కి లభిస్తున్నాయి. ప్రీమియం ఎయిర్పాడ్స్ ప్రో 3 రూ.25,900కి, ఎయిర్పాడ్స్ మాక్స్ 2 రూ.67,900 పాత ధరలకే అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్వాచ్ల విషయానికి వస్తే యాపిల్ వాచ్ సిరీస్ 11 రూ.46,900కి, బడ్జెట్ మోడల్ యాపిల్ వాచ్ ఎస్ఈ 3 రూ.25,900కి, మోస్ట్ రగ్గడ్ వాచ్ అల్ట్రా 3 రూ.89,900లకే విక్రయించబడుతున్నాయి. అయితే ఇవి కూడా ఎప్పుడు పెరుగుతాయో తెలియదు కాబట్టి, కొనే ఆలోచన ఉన్నవారు వెంటనే కొనుగోలు చేయడం మంచిదని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.
ప్రకటన
ప్రకటన