గ్లోబల్ మార్కెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం డిమాండ్ విపరీతంగా పెరగడంతో, స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లలో వాడే డీరామ్, నంద్ ఫ్లాష్ స్టోరేజ్ భాగాల ధరలు అనూహ్యంగా పెరిగాయి.
Photo Credit: Apple
Apple
Apple : ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ గురువారం భారతదేశంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో తన హార్డ్వేర్ ఉత్పత్తుల ధరలను భారీగా సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సరికొత్త ధరల పెంపు వల్ల దేశంలోని యాపిల్ ప్రియులపై పెద్ద ఎత్తున భారం పడనుంది. కంపెనీ తన లైనప్లోని మ్యాక్ డెస్క్టాప్ కంప్యూటర్లు, మ్యాక్బుక్స్, వివిధ మోడళ్ల ఐప్యాడ్లు, యాపిల్ టీవీ, హోమ్పాడ్ స్పీకర్ల రేట్లను పెంచేసింది. అయితే, ఈ మొత్తం ధరల సవరణలో ఐఫోన్ సిరీస్ను మాత్రం ప్రస్తుతానికి మినహాయించడం కస్టమర్లకు కాస్త ఊరటనిచ్చే అంశం.
గ్లోబల్ మార్కెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం డిమాండ్ విపరీతంగా పెరగడంతో, స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లలో వాడే డీరామ్, నంద్ ఫ్లాష్ స్టోరేజ్ భాగాల ధరలు అనూహ్యంగా పెరిగాయి. దీనివల్ల ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోవడంతో యాపిల్ ఈ నిర్ణయం తీసుకుంది. కొన్ని వారాల క్రితమే యాపిల్ సీఈఓ టిమ్ కుక్ మాట్లాడుతూ.. విడిభాగాల ధరలు పెరగడం వల్ల ప్రొడక్ట్స్ రేట్ల పెంపును నివారించడం అసాధ్యమని హెచ్చరించిన సంగతి తెలిసిందే.
మ్యాక్బుక్ ఎయిర్, మ్యాక్బుక్ నియో ధరలు
ఈ ధరల పెంపు ప్రభావం కస్టమర్లు ఎక్కువగా కొనుగోలు చేసే మ్యాక్బుక్ ఎయిర్ లైనప్పై గట్టిగా పడింది. 13-ఇంచుల మ్యాక్బుక్ ఎయిర్ ఎమ్5 చిప్ మోడల్ పాత ధర రూ.1,20,900 గా ఉండగా, ఇప్పుడు అది ఏకంగా రూ.1,49,900కి చేరుకుంది. అంటే దీనిపై రూ.29,000 పెరిగింది. అలాగే ఎంతో పాపులర్ అయిన బడ్జెట్ మోడల్ మ్యాక్బుక్ నియో ధర రూ.69,900 నుంచి రూ.10,000 పెరిగి ప్రస్తుతం రూ.79,900కి చేరింది.
మ్యాక్బుక్ ప్రో మోడళ్లపై లక్ష రూపాయల పెంపు
ప్రీమియం, ప్రొఫెషనల్ యూజర్లు వాడే మ్యాక్బుక్ ప్రో సిరీస్ ధరలు అయితే ఆకాశాన్ని తాకాయి. 14-ఇంచుల ఎమ్5 మ్యాక్బుక్ ప్రో ధర రూ.1,69,900 నుంచి ఏకంగా రూ.70,000 పెరిగి ఇప్పుడు రూ.2,39,900కి చేరుకుంది. ఇక అత్యంత శక్తివంతమైన ఎమ్5 మాక్స్ వేరియంట్ పై యాపిల్ ఏకంగా ఒక లక్ష రూపాయల భారాన్ని వేసింది. దీంతో దీని పాత ధర రూ.3,99,900 నుంచి ప్రస్తుతం రూ.4,99,900కి చేరింది. మరోవైపు డెస్క్టాప్ కంప్యూటర్ అయిన మ్యాక్ మినీ ఎమ్4 ధర కూడా రూ.59,900 నుంచి రూ.94,900కి పెరిగింది.
ఐప్యాడ్ లైనప్ తాజా ధరల వివరాలు
యాపిల్ ఐప్యాడ్ సిరీస్ లో కూడా రేట్లు భారీగా మారాయి. బేస్ మోడల్ అయిన 11వ జనరేషన్ ఐప్యాడ్ ధర రూ.39,900 నుంచి రూ.49,900కి పెరిగింది. అలాగే ఐప్యాడ్ మినీ ధర రూ.49,900 నుంచి రూ.20,000 అదనంగా పెరిగి రూ.69,900 వద్దకు చేరింది. 11-ఇంచుల ఎమ్4 ఐప్యాడ్ ఎయిర్ పాత ధర రూ.64,900గా ఉండగా, ప్రస్తుతం రూ.89,900 పలుకుతోంది. ఇక ఫ్లాగ్షిప్ మోడల్ ఐప్యాడ్ ప్రో ఎమ్5 ధర రూ.99,900 నుంచి ఏకంగా రూ.40,000 పెరిగి రూ.1,39,900 మార్కును దాటేసింది.
Samsung Galaxy A27 5G : భారత మార్కెట్లోకి శామ్సంగ్ కొత్త 5G ఫోన్.. బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లు
యాపిల్ టీవీ, హోమ్పాడ్ ఆడియో సిరీస్
హోమ్ ఎంటర్టైన్మెంట్ విభాగంలో కూడా యాపిల్ గట్టిగానే వడ్డించింది. యాపిల్ టీవీ 4కే డివైజ్ పాత ధర రూ.14,900గా ఉండగా, ఇప్పుడు దానిపై రూ.11,000 పెరిగి రూ.25,900 కి చేరింది. ప్రీమియం ఆడియో స్పీకర్ హోమ్పాడ్ ధర రూ.32,900 నుంచి రూ.44,900కి పెరగ్గా, చిన్న సైజ్ స్పీకర్ హోమ్పాడ్ మినీ ధర రూ.10,900 నుంచి రూ.15,900కి పెరిగింది. అంటే దీనిపై రూ.5,000 భారం పడింది.
టిమ్ కుక్, మార్క్ గుర్మన్ విశ్లేషణ
ధరల సవరణపై యాపిల్ అధినేత టిమ్ కుక్ మాట్లాడుతూ.. తాము పెరిగిన విడిభాగాల ఖర్చులను వీలైనంత వరకు భరించామని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కస్టమర్లపై భారం వేయక తప్పలేదని విచారం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కంపెనీకి నష్టాలు వస్తాయని పేర్కొన్నారు. కాగా, ప్రముఖ బ్లూమ్బెర్గ్ అనలిస్ట్ మార్క్ గుర్మన్ ఇటీవల విశ్లేషిస్తూ.. యాపిల్ కేవలం ఐఫోన్ 18 సిరీస్ లాంచ్ వరకే ఆగదని, అంతకంటే ముందే ఐఫోన్ల ధరలను కూడా పెంచే అవకాశం ఉందని అంచనా వేయడం ఇప్పుడు ఐఫోన్ యూజర్లలో కాస్త టెన్షన్ పుట్టిస్తోంది.
ప్రకటన
ప్రకటన
Apple Said to Skip M6 Pro, M6 Max Processors to Prioritise Development of AI-Focused M7 Chipsets