గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో క్రిప్టోకరెన్సీ రెగ్యులేషన్కు సంబంధించి అనేక పుకార్లు ప్రచారంలో ఉన్నాయి.
Crypto Currency
Crypto Currency : భారతదేశంలో క్రిప్టోకరెన్సీ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న మధ్యతరగతి ఇన్వెస్టర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారాన్ని అందించింది. దేశంలో క్రిప్టో సెగ్మెంట్ను నియంత్రించడానికి ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళికలు లేవని కేంద్రం స్పష్టం చేసింది. దీనికి గల ప్రధాన కారణాన్ని కూడా వెల్లడించింది. మన దేశంలో క్రిప్టోకరెన్సీలను చట్టబద్ధమైన ఒక ఆస్తిగా గుర్తించలేదని, కాబట్టి దానిని రెగ్యులేట్ చేసే ప్రశ్నే తలెత్తదని తేల్చి చెప్పింది. ఈ ప్రకటనతో క్రిప్టోలపై ప్రభుత్వం ఏదైనా నియంత్రణ చట్టాన్ని తెస్తుందని ఆశించిన ఇన్వెస్టర్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో క్రిప్టోకరెన్సీ రెగ్యులేషన్కు సంబంధించి అనేక పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. ఆర్బీఐ, సెబీలను సంప్రదించి దేశంలో క్రిప్టో నియంత్రణపై కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోందంటూ ప్రచారం సాగింది. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వ అధికారిక విభాగం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(PIB) సోషల్ మీడియా వేదికగా స్పందించి తీవ్రంగా ఖండించింది. ఇదంతా కేవలం అవాస్తవ ప్రచారమని, ఆర్థిక శాఖ అలాంటి ఆదేశాలేవీ జారీ చేయలేదని స్పష్టం చేసింది. పెట్టుబడిదారులు ఇటువంటి వదంతులను నమ్మవద్దని, కేవలం ప్రభుత్వ అధికారిక మార్గాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని కోరింది.
మరోవైపు భారతీయ రిజర్వ్ బ్యాంక్ క్రిప్టోకరెన్సీలపై తన కఠిన వైఖరిని కొనసాగిస్తోంది. అంతర్గత నివేదికల ప్రకారం.. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, ఏ ఇతర ఆర్థిక సంస్థలు కూడా క్రిప్టోకరెన్సీలలో ట్రేడింగ్ చేయడం కానీ, ప్రైవేట్ సంస్థల స్టేబుల్కాయిన్స్ను హోల్డ్ చేయడం కానీ చేయకూడదని ఆర్బీఐ భావిస్తోంది. అలాగే ఇందులో నిధులు ఇన్వెస్ట్ చేయడాన్ని కూడా పూర్తిగా నిషేధించాల్సిందేనని స్పష్టం చేసింది. వ్యవస్థీకృత బ్యాంకింగ్ రంగానికి క్రిప్టోల వల్ల తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, అందుకే దీనిని బ్యాంకింగ్ సిస్టమ్ పరిధికి దూరంగా ఉంచాలని ఆర్బీఐ గట్టిగా వాదిస్తోంది. ఈ విషయమై ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
క్రిప్టో మార్కెట్లో ఉండే విపరీతమైన రిస్క్, ఒడిదుడుకులకు గత కొన్ని నెలల పరిణామాలే నిదర్శనంగా నిలిచాయి. ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రిప్టోకరెన్సీగా పేరొందిన బిట్కాయిన్ గతేడాది అక్టోబర్లో 1,26,000 డాలర్ల మార్కును దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. అయితే ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. అంతర్జాతీయంగా దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, ఆర్థిక మందగమనం భయాల వల్ల ప్రస్తుతం బిట్కాయిన్ విలువ ఏకంగా 50 శాతం వరకు పడిపోయింది. ఈ రకమైన ఒడిదుడుకుల వల్ల కష్టపడి సంపాదించుకున్న డబ్బును క్రిప్టోల్లో పెట్టి మధ్యతరగతి ప్రజలు నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది.
డబ్బులు సులభంగా సంపాదించవచ్చనే ఆశతో చాలామంది మధ్యతరగతి ఉద్యోగులు, యువత అవగాహన లేకుండా క్రిప్టో మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే దీనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి చట్టపరమైన రక్షణ లేదు. ఒకవేళ ఏదైనా మోసం జరిగితే లేదా క్రిప్టో ఎక్స్ఛేంజీలు మూతపడితే కస్టమర్ల డబ్బును తిరిగి రాబట్టడం అసాధ్యం. వర్చువల్ డిజిటల్ అసెట్స్ (VDA) వల్ల దేశ ఆర్థిక భద్రతకే ముప్పు ఉందని ఆర్బీఐ మొదటి నుంచీ హెచ్చరిస్తోంది. కాబట్టి సామాన్యులు తమ కష్టార్జితాన్ని ఇటువంటి అత్యంత ప్రమాదకరమైన మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవడం మంచిది.
ప్రకటన
ప్రకటన