2026 మొదటి మూడు నెలల్లో (జనవరి-మార్చి) భారతదేశంలోకి కేవలం 31 మిలియన్ల (3.1 కోట్లు) స్మార్ట్ఫోన్లు మాత్రమే షిప్మెంట్ అయ్యాయి.
Vivo had a market share of 19.6 percent in India in Q1
Smartphone : భారతదేశ స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఎప్పుడూ లేని విధంగా ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. దేశంలో కొత్త మొబైల్ ఫోన్ల అమ్మకాలు భారీగా పడిపోయినప్పటికీ.. స్మార్ట్ఫోన్ మార్కెట్ మొత్తం విలువ మాత్రం పెరిగింది. ప్రముఖ గ్లోబల్ రీసెర్చ్ సంస్థ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ విడుదల చేసిన తాజా 2026 క్వార్టర్-1 నివేదిక ప్రకారం.. భారత్లో మొబైల్ ఫోన్ల కొనుగోళ్లు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. అయితే, దీనికి కారణం జనం ఫోన్లు కొనడం తగ్గించడం కాదు, కంపెనీలు బడ్జెట్ ఫోన్ల తయారీని తగ్గించడమేనని ఐడీసీ విశ్లేషించింది. ఈ త్రైమాసికంలో కూడా చైనా మొబైల్ దిగ్గజం వివో తన నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోగా, శామ్సంగ్ రెండో స్థానంలో నిలిచింది.
క్యూ1 లో 31 మిలియన్ల ఫోన్లు మాత్రమే సరఫరా
ఐడీసీ వరల్డ్వైడ్ క్వార్టర్లీ మొబైల్ ఫోన్ ట్రాకర్ నివేదిక ప్రకారం.. 2026 మొదటి మూడు నెలల్లో (జనవరి-మార్చి) భారతదేశంలోకి కేవలం 31 మిలియన్ల (3.1 కోట్లు) స్మార్ట్ఫోన్లు మాత్రమే షిప్మెంట్ అయ్యాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది ఏకంగా 4.1 శాతం క్షీణతను నమోదు చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వర్ల డిమాండ్ పెరగడం వల్ల మార్కెట్లో మెమొరీ, స్టోరేజ్ కాంపోనెంట్స్ కొరత ఏర్పడింది. దీంతో ఫోన్ల తయారీ ఖర్చులు పెరిగి రేట్లు ఎక్కువవుతాయని ఊహించిన మొబైల్ కంపెనీలు ముందే స్టాక్ను మార్కెట్లోకి పంపాయి. కానీ పండగల సీజన్ తర్వాత సాధారణంగా ఉండే మందగమనం వల్ల కస్టమర్ల నుండి పెద్దగా డిమాండ్ రాలేదు.
మొబైల్ ఫోన్ల యావరేజ్ రేటు రూ.29,000
అమ్మకాలు తగ్గినప్పటికీ, భారత స్మార్ట్ఫోన్ మార్కెట్ మొత్తం విలువ వాల్యూ పరంగా 5.8 శాతం వృద్ధిని సాధించింది. దీనర్థం ఏంటంటే, భారతీయులు ఇప్పుడు చౌకబారు బడ్జెట్ ఫోన్ల కంటే ఎక్కువ ధర ఉండే ప్రీమియం ఫోన్లను కొనడానికే మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లో ఫోన్ల సగటు అమ్మకపు ధర 10.4 శాతం పెరిగి ఏకంగా $302 (దాదాపు రూ.29,000)కు చేరుకుంది. అయితే ఇది కస్టమర్ల ఇష్టపూర్వక మార్పు కాదు, కంపెనీల మాయాజాలం. ఎందుకంటే స్పేర్ పార్ట్స్ ధరలు పెరగడం వల్ల రూ.10 వేల లోపు ఫోన్లను తయారు చేస్తే కంపెనీలకు లాభాలు రావడం లేదు. అందుకే బ్రాండ్లన్నీ తక్కువ బడ్జెట్ ఫోన్ల ప్రొడక్షన్ను తగ్గించి, కస్టమర్లను బలవంతంగా మిడ్-రేంజ్ మరియు ప్రీమియం రేంజ్ ఫోన్ల వైపు నెడుతున్నాయి.
ఐడీసీ విడుదల చేసిన టాప్ 10 బ్రాండ్స్ లిస్ట్ ఇదే
భారత మార్కెట్లో ఏ ఏ బ్రాండ్లు ఎంత శాతం మార్కెట్ షేర్తో టాప్లో ఉన్నాయో ఐడీసీ స్పష్టమైన లిస్ట్ను ఇచ్చింది.
* వివో : 19.6 శాతం మార్కెట్ షేర్తో దేశంలోనే నంబర్ వన్ స్మార్ట్ఫోన్ బ్రాండ్గా అవతరించింది.
* శామ్సంగ్ : 17.1 శాతం మార్కెట్ షేర్తో రెండో స్థానాన్ని దక్కించుకుంది.
* ఒప్పో : ఏకంగా 22 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసి, 15.3 శాతం షేర్తో మూడో స్థానంలో నిలిచింది.
* షావోమి & పోకో : ఈ రెండు బ్రాండ్లు కలిపి 12.2 శాతం ఉమ్మడి మార్కెట్ షేర్ను కలిగి ఉన్నాయి.
* ఆపిల్ : ఇండివిడ్యువల్ బ్రాండ్ల పరంగా ఆపిల్ 9.4 శాతం షేర్తో నాల్గో స్థానంలో ఉంది. (అయితే వాల్యూ/ఆదాయం పరంగా ఆపిల్ దే 28% తో అగ్రస్థానం).
* మోటరోలా : 14 శాతం అద్భుతమైన గ్రోత్తో, 8.9 శాతం మార్కెట్ షేర్తో చరిత్రలో తొలిసారి టాప్-5 లోకి దూసుకొచ్చింది.
* రియల్మీ : 8.8 శాతం మార్కెట్ షేర్తో ఆరో స్థానానికి పడిపోయింది.
* ఐకూ & వన్ప్లస్ : వరుసగా 1.9 శాతం, 1.7 శాతం మార్కెట్ షేర్తో తొమ్మిది, పది స్థానాల్లో నిలిచాయి. మెమొరీ కొరత వల్ల వన్ప్లస్ అమ్మకాలు ఏకంగా 32 శాతం మేర దెబ్బతిన్నాయి.
ఆన్లైన్ డిస్కౌంట్లు మాయం
ఈ నివేదికలో మరో కీలకమైన మార్పు ఏంటంటే.. ఇన్నాళ్లూ ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి సైట్లలో ఫ్లాష్ సేల్స్, భారీ డిస్కౌంట్లతో నడిచిన ఆన్లైన్ మార్కెట్ షేర్ 42 శాతం నుండి 38 శాతానికి పడిపోయింది. ఆన్లైన్ షిప్మెంట్లు 14 శాతం తగ్గాయి. విడిభాగాల ధరలు పెరగడం వల్ల కంపెనీలు ఆన్లైన్ డిస్కౌంట్లను పూర్తిగా తగ్గించేశాయి. దీనివల్ల ఎక్కువ మంది కస్టమర్లు ఈఎంఐ ఆఫర్లు, ఫైనాన్స్ సౌకర్యాల కోసం నేరుగా ఆఫ్లైన్ మొబైల్ స్టోర్ల (62% మార్కెట్ షేర్) వైపు అడుగులు వేస్తున్నారు. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం కూడా మొబైల్ ధరలు పెరగడానికి ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు.
ప్రకటన
ప్రకటన
Xiaomi Smart Band 10 Pro Launched With 1.74-Inch AMOLED Screen, Up to 21 Days Battery Life: Price, Features
Google’s Gemini Offers Agentic Design Creation With New Adobe and Canva Connectors