ఈ సరికొత్త ఈవీ పాలసీ జూలై 1 నుంచి అధికారికంగా అమలు కాబోతోంది.
Photo Credit: Delhi EV Policy
Delhi EV Policy
Delhi EV Policy : దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడానికి ఢిల్లీ ప్రభుత్వం సరికొత్త ఈవీ పాలసీ 2026కి ఆమోదం తెలిపింది. రాజధాని నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అదుపులోకి తీసుకురావడం, స్వచ్ఛమైన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తేవడమే ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం. ఈ సరికొత్త విధానం ద్వారా ఢిల్లీలో ఎలక్ట్రిక్ కార్లు కొనేవారికి రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ టాక్స్ నుంచి పూర్తి మినహాయింపు లభించనుంది. అలాగే ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ కొనుగోలుపై కూడా ప్రభుత్వం భారీగా సబ్సిడీలను ప్రకటించింది.
ఈ సరికొత్త ఈవీ పాలసీ జూలై 1 నుంచి అధికారికంగా అమలు కాబోతోంది. ఈ పాలసీ గడువు మార్చి 31, 2030 వరకు ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీని కింద రూ.30 లక్షల బడ్జెట్ లోపు ఉండే ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేస్తే ఎలాంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు, రోడ్ టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా, మీ దగ్గర ఉన్న పాత బీఎస్-4 లేదా అంతకంటే పాత ఫోర్-వీలర్ వాహనాలను స్క్రాప్ చేసి కొత్త ఎలక్ట్రిక్ కారు కొంటే ఏకంగా రూ.1 లక్ష వరకు స్క్రాపేజ్ ఇన్సెంటివ్ లభిస్తుంది. అయితే, హైబ్రిడ్ వాహనాలు కొనేవారికి మాత్రం ఎలాంటి సబ్సిడీలు వర్తించవని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ (బైకులు, స్కూటర్లు) కొనుగోలు చేసే వారికి ఈ పాలసీలో అదిరిపోయే రాయితీలు ఉన్నాయి. ఈ విధానం అమల్లోకి వచ్చిన మొదటి సంవత్సరంలో రూ.30,000, రెండో సంవత్సరంలో రూ.20,000, మూడో సంవత్సరంలో రూ.10,000 చొప్పున సబ్సిడీ లభిస్తుంది. అదేవిధంగా ఎలక్ట్రిక్ త్రీ-వీలర్స్ (ఆటోలు) పై మొదటి ఏడాది రూ.50,000, రెండో ఏడాది రూ.40,000, మూడో ఏడాది రూ.30,000 రాయితీ ఇస్తారు. పెద్ద ఎలక్ట్రిక్ ట్రక్కులను కొనుగోలు చేసే వారికి కూడా రూ.1 లక్ష వరకు ఇన్సెంటివ్ అందజేస్తారు. అయితే, వచ్చే ఏడాది (2027 జనవరి 1) నుంచి కేవలం ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల రిజిస్ట్రేషన్ మాత్రమే జరుగుతుందని, అంతేకాకుండా 2028 ఏప్రిల్ 1 నుంచి కొత్త పెట్రోల్, సీఎన్జీ (CNG) టూ-వీలర్ల రిజిస్ట్రేషన్లను పూర్తిగా నిలిపివేయాలని ప్రభుత్వం సంచలన ప్లాన్ సిద్ధం చేసింది.
Huawei Mate 90 : కళ్లు చెదిరే కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్.. హువావే సరికొత్త స్మార్ట్ఫోన్ సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్
ఢిల్లీ రాజధానిలో ఈ పాలసీని విజయవంతం చేయడం కోసం రాబోయే నాలుగేళ్లలో ప్రభుత్వం సుమారు రూ.15,000 కోట్లను ఖర్చు చేయబోతోంది. ఈ మొత్తం బడ్జెట్లో దాదాపు రూ.7,000 కోట్లను కేవలం కస్టమర్లకు ఇన్సెంటివ్లు, సబ్సిడీలు ఇవ్వడానికే కేటాయించారు. మిగిలిన రూ.8,000 కోట్ల నిధులను నగరవ్యాప్తంగా సరికొత్త ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల నిర్మాణం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టాక్స్ మినహాయింపుల కోసం ఉపయోగించనున్నారు. దీనివల్ల రాబోయే రోజుల్లో ఢిల్లీలో ఛార్జింగ్ ఇబ్బందులు పూర్తిగా తొలగిపోనున్నాయి.
దేశంలో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు రాబోయే ఆర్థిక సంవత్సరం నాటికి రెండింతలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నివేదికలు చెబుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా మొత్తం 2.2 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడవగా, వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఈ సంఖ్య ఏకంగా 5 లక్షల యూనిట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఎలక్ట్రిక్ కార్ల సగటు నెలవారీ అమ్మకాలు కూడా 40 శాతం పెరిగి.. ప్రతి నెలా సుమారు 26,000 యూనిట్లు అమ్ముడవుతున్నాయి. గత మూడు నెలల డేటా ప్రకారం.. దేశంలో అమ్ముడవుతున్న మొత్తం ప్యాసింజర్ వాహనాలలో ఎలక్ట్రిక్ కార్ల వాటా 6.1 శాతానికి పెరగడం విశేషం.
ప్రకటన
ప్రకటన