ఒక్క 2024 లోనే బాధితులు దాదాపు రూ.1,935.5 కోట్లు పోగొట్టుకున్నారు. అయితే, గత కొన్ని నెలలుగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ఈ కేసుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది.
Photo Credit: Unsplash/ Rapha Wilde
Digital Arrest Scam
Digital Arrest : భారతదేశంలో టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా కొత్త రూపాలు దాల్చుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో జరిగే మోసాలు ఊహించని విధంగా పెరిగిపోయాయి. తాజా గణాంకాల విశ్లేషణ ప్రకారం.. 2022 నుంచి మే 2026 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్ట్కు సంబంధించి ఏకంగా 2,97,727 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ ఘోరమైన మోసాల వల్ల సామాన్య ప్రజలు ఏకంగా రూ.4,057.7 కోట్ల భారీ మొత్తాన్ని నష్టపోయారు. ఒక నివేదిక ప్రకారం.. 2022లో ఈ తరహా కేసులు 39,925 మాత్రమే ఉండగా, 2024 నాటికి ఈ సంఖ్య రికార్డు స్థాయిలో 1,23,672కి చేరుకుంది. ఒక్క 2024 లోనే బాధితులు దాదాపు రూ.1,935.5 కోట్లు పోగొట్టుకున్నారు. అయితే, గత కొన్ని నెలలుగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ఈ కేసుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది.
వృద్ధులే టార్గెట్గా రెచ్చిపోతున్న ముఠాలు
సైబర్ నేరగాళ్లు ముఖ్యంగా రిటైర్ అయిన వారిని, సీనియర్ సిటిజన్లను, ఒంటరిగా ఉండే వృద్ధులను టార్గెట్ చేస్తున్నారు. వీరికి చట్టాలపై ఉండే అవగాహన లోపాన్ని, భయాన్ని ఆసరాగా చేసుకుని లక్షలు, కోట్లు కాజేస్తున్నారు. ఇటీవలే దేశ రాజధాని ఢిల్లీలో ఒక ఎన్నారై డాక్టర్ దంపతులను భయపెట్టి ఏకంగా రూ.14.84 కోట్లు దోచుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. తాము దర్యాప్తు సంస్థ అధికారులమంటూ నమ్మించిన కేటుగాళ్లు, వీడియో కాల్స్ ద్వారా ఆ దంపతులను రోజురోజుకూ మానసిక ఒత్తిడికి గురిచేశారు. వారిపై మనీ లాండరింగ్ లాంటి తప్పుడు కేసులు ఉన్నాయని బెదిరించి, ఆ డబ్బు మొత్తాన్ని వేర్వేరు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు. ఇలాంటి ఘోరమైన ఘటనలు గోవా, ఇతర రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున వెలుగు చూస్తున్నాయి.
అసలు ఏంటి ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్?
ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్ వెనుక చాలా పెద్ద నెట్వర్క్ పనిచేస్తోంది. మోసగాళ్లు మొదట బాధితులకు ఫోన్ చేసి.. తాము పోలీస్, సిబిఐ, ఈడీ లేదా ఆర్బీఐ అధికారులమని పరిచయం చేసుకుంటారు. ఆ తర్వాత, బాధితుల గుర్తింపు కార్డులు, మొబైల్ నెంబర్లు లేదా బ్యాంక్ అకౌంట్లు ఏదైనా అక్రమ రవాణాకో, లేదా తీవ్రవాద కార్యకలాపాలకో ఉపయోగించబడ్డాయని చెప్పి తీవ్రంగా భయపెడతారు. అనంతరం మిమ్మల్ని కోర్టు ఆదేశాల ప్రకారం డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని నమ్మిస్తారు. అంటే, స్కైప్ లేదా ఇతర యాప్స్ ద్వారా వీడియో కాల్స్ చేసి, గంటల తరబడి బాధితులను గదిలోనే బంధిస్తారు. వారు వేరే ఎవరికీ ఫోన్ చేయకుండా, కనీసం కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడకుండా నిరంతరం నిఘా ఉంచుతారు. చివరకు కేసు నుంచి బయటపడాలంటే డబ్బులు కట్టాలని చెప్పి ఆన్లైన్ ద్వారా తక్షణమే ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు.
Google : టెక్ లవర్స్కు పండగే.. మేడ్ బై గూగుల్ ఈవెంట్ డేట్ కన్ఫర్మ్.. పిక్సెల్ 11 సిరీస్ వచ్చేస్తోంది
సైబర్ దొంగల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?
చట్టప్రకారం భారతదేశంలో ఏ ప్రభుత్వ దర్యాప్తు సంస్థ లేదా పోలీసులు కూడా వీడియో కాల్స్ ద్వారా ఎవరినీ అరెస్ట్ చేయరనే కనీస విషయాన్ని ప్రజలు గుర్తించాలి. ఒకవేళ మీకు ఎవరైనా ఫోన్ చేసి బెదిరిస్తే అస్సలు భయపడకండి. ఆ ఫోన్ కాల్స్ లేదా వీడియో కాల్స్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయవద్దు. మీ వ్యక్తిగత గుర్తింపు కార్డుల వివరాలు, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు, ఓటీపీ, యూపీఐ పిన్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్లను ఎవరితోనూ షేర్ చేయకండి. ఎవరైనా మిమ్మల్ని గదిలోనే ఉండాలని వీడియో కాల్లో ఒత్తిడి చేస్తే వెంటనే కాల్ కట్ చేయండి. ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైనట్లు అనిపిస్తే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే జాతీయ సైబర్ హెల్ప్లైన్ నెంబర్ 1930 కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ www.cybercrime.gov.in లో ఫిర్యాదు నమోదు చేయండి. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే, మీ పోగొట్టుకున్న డబ్బు తిరిగి వచ్చే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది.
ప్రకటన
ప్రకటన