దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎయిర్టెల్ ప్రయారిటీ పోస్ట్పెయిడ్ సర్వీస్ను కంపెనీ లాంచ్ చేసింది.
Photo Credit: Unsplash/James Yarema
5G network slicing creates virtual network layers optimised for different services and users
Airtel : క్రికెట్ స్టేడియంలు, భారీ మ్యూజిక్ కాన్సెర్టులు, ఎయిర్పోర్టులు లేదా విపరీతమైన రద్దీ ఉండే మార్కెట్ ఏరియాలకు వెళ్లినప్పుడు మొబైల్ నెట్వర్క్ పూర్తిగా డౌన్ అయిపోవడం మనం చూస్తూనే ఉంటాం. ఫోన్ సిగ్నల్స్ ఫుల్గా ఉన్నా ఇంటర్నెట్ అస్సలు పనిచేయదు, చివరికి ఒక వాట్సాప్ మెసేజ్ వెళ్లడానికి కూడా గంటల సమయం పడుతుంది. ఈ చిరాకుకు శాశ్వతంగా బై-బై చెప్పేందుకు ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ సరికొత్త విప్లవాత్మక సాంకేతికతను భారత్లో పరిచయం చేసింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎయిర్టెల్ ప్రయారిటీ పోస్ట్పెయిడ్ సర్వీస్ను కంపెనీ లాంచ్ చేసింది. 2026 మే నెలలో తీసుకొచ్చిన ఈ సరికొత్త సేవ ద్వారా, ఎంతటి భారీ రద్దీ ఉన్న ప్రాంతాల్లోనైనా సరే నెట్వర్క్ డ్రాప్స్ లేకుండా అత్యంత వేగవంతమైన, స్థిరమైన 5G ఇంటర్నెట్ను కస్టమర్లు ఆస్వాదించవచ్చు. .
అసలు ఏంటో ఈ 5G నెట్వర్క్ స్లైసింగ్..?
రద్దీ ప్రాంతాల్లో కూడా సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ ఇవ్వడానికి ఎయిర్టెల్ సంస్థ 5G నెట్వర్క్ స్లైసింగ్ అనే సరికొత్త టెక్నాలజీని ఉపయోగించింది. సాఫ్ట్వేర్-డిఫైన్డ్ నెట్వర్కింగ్ (SDN) ఆధారంగా పనిచేసే ఈ టెక్నాలజీ ద్వారా.. ఒకే ఒక ఫిజికల్ 5G నెట్వర్క్ను ఒకటి కంటే ఎక్కువ వర్చువల్ నెట్వర్క్లుగా (స్లైసెస్ లేదా ముక్కలుగా) విభజించవచ్చు. సాధారణంగా ఒకే టవర్ పరిధిలోకి వేల మంది యూజర్లు వచ్చినప్పుడు అందరూ ఒకే రోడ్డుపై పోటీ పడటంతో ఇంటర్నెట్ స్లో అయిపోతుంది. కానీ, ఈ నెట్వర్క్ స్లైసింగ్ ద్వారా ఎయిర్టెల్ తన నెట్వర్క్లో ఒక ప్రత్యేకమైన వర్చువల్ ఫాస్ట్లేన్ను క్రియేట్ చేసింది. దీనివల్ల సాధారణ ట్రాఫిక్ ఉన్నప్పటికీ, ఈ ప్రయారిటీ యూజర్లకు ఇంటర్నెట్ స్పీడ్ అస్సలు తగ్గదు.
నెట్వర్క్ స్లైసింగ్ ఎలా పనిచేస్తుందో తెలుసా?
దీనిని సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఒక పెద్ద హైవే ఉంది అనుకోండి. సాధారణంగా అన్ని వాహనాలు ఒకే లైన్ లో వెళ్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది. అదే ఆ హైవేపై అంబులెన్స్, విఐపి వాహనాలు లేదా అత్యవసర సేవల కోసం ఒక ప్రత్యేకమైన డెడికేటెడ్ లేన్ కేటాయిస్తే.. మిగతా రోడ్డుపై ఎంత ట్రాఫిక్ ఉన్నా ఈ లేన్ లోని వాహనాలు వేగంగా దూసుకుపోతాయి. 5G నెట్వర్క్ స్లైసింగ్ కూడా సరిగ్గా ఇలాగే పనిచేస్తుంది. ఇక్కడ మొబైల్ టవర్లు మారవు, కానీ సాఫ్ట్వేర్ ద్వారా నెట్వర్క్ లోపలే ఒక ప్రత్యేక విఐపి దారిని ఎయిర్టెల్ క్రియేట్ చేసింది. అమెరికా, బ్రిటన్, సింగపూర్ వంటి దేశాల తర్వాత ఇండియాలో ఈ టెక్నాలజీని తెచ్చిన మొదటి ఆపరేటర్ ఎయిర్టెల్ మాత్రమే.
ఈ సర్వీస్ ఎవరికి అందుబాటులో ఉంటుంది..?
ఎయిర్టెల్ తీసుకొచ్చిన ఈ ప్రయారిటీ పోస్ట్పెయిడ్ సేవలు ప్రస్తుతం కంపెనీకి చెందిన పోస్ట్పెయిడ్ ప్లాన్స్ వాడుతున్న వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చాయి. నెలకు రూ. 449 ప్రారంభ ధర గల బేసిక్ ప్లాన్ నుండి ఫ్యామిలీ ప్లాన్ల వరకు అన్నింటికీ దీనిని ఆటోమేటిక్గా అప్గ్రేడ్ చేశారు. అయితే ఈ విఐపి ఇంటర్నెట్ స్పీడ్ను అందుకోవాలంటే ఒక ముఖ్యమైన నిబంధన ఉంది. వినియోగదారుల వద్ద ఖచ్చితంగా 5G స్టాండ్అలోన్ నెట్వర్క్ను సపోర్ట్ చేసే స్మార్ట్ఫోన్ ఉండాలి. అలాగే మొబైల్ లో లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ అయి ఉండాలి. మీ ఫోన్ దీనికి సపోర్ట్ చేస్తుందో లేదో మై ఎయిర్టెల్ యాప్ లోకి వెళ్లి ఈజీగా చెక్ చేసుకోవచ్చు.
నెట్వర్క్ స్లైసింగ్ లో ఉన్న సవాళ్లు ఇవే
ఈ సాంకేతికత అద్భుతమైనదే అయినప్పటికీ ఇందులో కొన్ని పరిమితులు, సవాళ్లు ఉన్నాయి. నెట్వర్క్ స్లైసింగ్ పరిపూర్ణంగా పనిచేయాలంటే టెలికాం ఆపరేటర్లు పూర్తిగా 4G మద్దతు లేని ప్యూర్ 5G స్టాండ్అలోన్ (5G SA) కోర్ నెట్వర్క్ను కలిగి ఉండాలి. లక్షలాది మంది యూజర్లకు రియల్ టైమ్లో ఈ వర్చువల్ లేన్లను మేనేజ్ చేయడం, ఒక లేన్ లోని సెక్యూరిటీ సమస్యలు ఇంకో లేన్ పై పడకుండా చూసుకోవడం పెద్ద టాస్క్. అంతేకాకుండా, డబ్బులు ఎక్కువ కట్టే పోస్ట్పెయిడ్ యూజర్లకు మాత్రమే ఇలా ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల.. సాధారణ ప్రిపెయిడ్ యూజర్ల నెట్వర్క్ క్వాలిటీ దెబ్బతింటుందా? ఇది నెట్ న్యూట్రాలిటీ (Net Neutrality) ను ఉల్లంఘించడమేనా? అనే సరికొత్త చర్చకు కూడా ఈ ప్లాన్ తెరలేపింది.
ప్రకటన
ప్రకటన
Activision to Shut Down Call of Duty: Warzone on PS4, Xbox One After Modern Warfare 4 Launch