యూపీఐ నెక్స్ట్ జనరేషన్ ఫీచర్లలో వాయిస్ అసిస్టెంట్, మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ కీలక పాత్ర పోషించనున్నాయి.
Photo Credit: Unsplash/ David Dvoracek
NPCI UPI
UPI : భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల రూపురేఖలను మార్చేసిన యూపీఐ టెక్నాలజీ.. రాబోయే రోజుల్లో మరింత స్మార్ట్గా, సులభంగా మారబోతోంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తన యూపీఐ తదుపరి దశ వృద్ధిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని భారీగా ఉపయోగించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ విషయాన్ని ఎన్పీసీఐ సీఈఓ దిలీప్ అస్బే ఒక ఇంటర్వ్యూలో అధికారికంగా వెల్లడించారు. ఏఐ సహాయంతో గ్రామీణ ప్రాంతాల వారికి, కొత్త వినియోగదారులకు యూపీఐని మరింత సులభంగా చేరువ చేయవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
యూపీఐ నెక్స్ట్ జనరేషన్ ఫీచర్లలో వాయిస్ అసిస్టెంట్, మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ కీలక పాత్ర పోషించనున్నాయి. టెక్క్రంచ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిలీప్ అస్బే మాట్లాడుతూ.. కేవలం వాయిస్ కమాండ్స్ ద్వారా లేదా మన సొంత భాషల్లో మాట్లాడుకుంటూ యూపీఐని ఆపరేట్ చేసేలా సరికొత్త సొల్యూషన్స్ తీసుకువస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల చదువురాని వారు లేదా యాప్ వాడటం తెలియని వారు కూడా చాలా సులభంగా డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్లోకి అడుగు పెట్టవచ్చు. నిజానికి ఎన్పీసీఐ 2023లోనే వాయిస్ బేస్డ్ ఇంటరాక్టివ్ సిస్టమ్ను లాంచ్ చేసినప్పటికీ, అది ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అందుకే ఇప్పుడు ఏఐ సాయంతో ఆ లోపాలను సరిచేసి మరింత పటిష్టంగా తీసుకురానున్నారు.
ఏఐ టెక్నాలజీ కేవలం కొత్త యూజర్లు యాడ్ అవ్వడానికే కాకుండా.. ఆన్లైన్ భద్రతను పెంచడానికి కూడా ఉపయోగపడనుంది. ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న ఆన్లైన్ ఫ్రాడ్స్, సైబర్ నేరాలను అరికట్టడానికి ఎన్పీసీఐ ఈ కొత్త అస్త్రాన్ని ప్రయోగించబోతోంది. ఏఐ అల్గారిథమ్స్ సాయంతో అనుమానాస్పదంగా జరిగే లావాదేవీలు, ఫ్రాడ్ అకౌంట్లు, మ్యూల్ అకౌంట్లను చాలా ఈజీగా గుర్తిస్తారు. దీనివల్ల యూజర్ల డబ్బుకు పూర్తి భద్రత లభిస్తుంది.
Redmi Pad 2 : భారతదేశంలో రెడ్మీ ప్యాడ్ 2 ధర పెంపు.. వేరియంట్ కొత్త ధర ఎంతంటే?
దీనితో పాటు, భవిష్యత్తులో యూపీఐ అకౌంట్ ఆధారంగా లోన్ ఇచ్చే ప్రక్రియను కూడా సులభతరం చేయనున్నారు. వినియోగదారులు, వ్యాపారుల డిజిటల్ ప్రొఫైల్, వారి నెలవారీ ట్రాన్సాక్షన్ల డేటాను ఏఐ సిస్టమ్స్ విశ్లేషిస్తాయి. దీని ఆధారంగా ఎవరికి ఎంత లోన్ ఇవ్వచ్చు? వారి క్రెడిట్ అర్హత ఏమిటి? అనేది బ్యాంకులు క్షణాల్లో తేల్చేస్తాయి. దీనివల్ల లోన్ అప్రూవల్ ప్రాసెస్ చాలా వేగంగా మారుతుంది. అయితే దీని లాంచ్ టైమ్లైన్ను ఎన్పీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
ఎన్పీసీఐ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం భారతదేశంలో ప్రతిరోజూ 75 కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలు విజయవంతంగా జరుగుతున్నాయి. ఈ సంఖ్యను రాబోయే రోజుల్లో రోజుకు 100 కోట్లకు (1 బిలియన్) చేర్చడమే ఎన్పీసీఐ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ప్రస్తుత యూపీఐ మార్కెట్ను పరిశీలిస్తే.. ప్రైవేట్ యాప్లైన ఫోన్పే, గూగుల్పేలదే హవా నడుస్తోంది. ఈ రెండు యాప్ల ఉమ్మడి మార్కెట్ వాటా ఏకంగా 80 శాతానికి పైగా ఉంది. కాగా, ప్రభుత్వానికి చెందిన అధికారిక యాప్ భీమ్ యూపీఐ వాటా మాత్రం కేవలం 1 శాతం లోపే ఉండటం గమనార్హం. రాబోయే ఏఐ ఫీచర్లు ఈ మార్కెట్ సమీకరణాలను మారుస్తాయో లేదో చూడాలి.
ప్రకటన
ప్రకటన
Tom Clancy's Ghost Recon: Future Soldier Is Free to Claim on Ubisoft Store for a Week
Amazon Great Freedom Sale 2026: Best Deals on Refrigerators from Haier, LG, Samsung and More Brands