విపరీతమైన వేడి కారణంగా ఈ డేటా సెంటర్లలోని కూలింగ్ సిస్టమ్స్, పవర్ సప్లై, వాటి రోజువారీ ఆపరేషన్లు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది.
Photo Credit: AI Generated
AI
AI Data Centers : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)కు డిమాండ్ విపరీతంగా పెరిగిపోవడంతో, గ్లోబల్ టెక్ కంపెనీలు భారీ డేటా సెంటర్లను వేగంగా నిర్మిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ డేటా సెంటర్ల మనుగడకే ఒక పెద్ద ముప్పు వచ్చి పడింది. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, విపరీతమైన హీట్వేవ్స్ ఏఐ డేటా సెంటర్లకు ప్రధాన శత్రువులుగా మారుతున్నాయి. తాజా నివేదికల ప్రకారం.. విపరీతమైన వేడి కారణంగా ఈ డేటా సెంటర్లలోని కూలింగ్ సిస్టమ్స్, పవర్ సప్లై, వాటి రోజువారీ ఆపరేషన్లు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పుడు గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద టెక్ కంపెనీలు తమ డేటా సెంటర్ల డిజైన్లను, కూలింగ్ పద్ధతులను మార్చడంపై దృష్టి పెట్టాయి.
సీఎన్బీసీ నివేదిక ప్రకారం.. ఏఐ డేటా సెంటర్లలో వాడే హై-పర్ఫార్మెన్స్ చిప్స్ నిరంతరం పనిచేస్తూ విపరీతమైన వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఈ సర్వర్లను ఎప్పుడూ చల్లగా ఉంచడానికి సాధారణ రోజుల్లోనే డేటా సెంటర్కు వచ్చే మొత్తం విద్యుత్లో దాదాపు 40 శాతం కేవలం కూలింగ్ కోసమే వాడాల్సి వస్తుంది. ఇక వేసవి కాలంలో బయట ఎండలు ముదిరిపోతే, వీటిని చల్లబరచడానికి మరింత ఎక్కువ కరెంట్ అవసరమవుతుంది. ఇదే సమయంలో సాధారణ ప్రజలు కూడా ఏసీలు ఎక్కువగా వాడటం వల్ల పవర్ గ్రిడ్లపై భారం పెరిగి, పవర్ కట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కరెంట్ పోతే ఈ డేటా సెంటర్లు ఆగిపోయి డిజిటల్ సేవలకు అంతరాయం కలుగుతుంది.
క్లైమేట్ రిస్క్ అనలిటిక్స్ సంస్థ ఫర్స్ట్ స్ట్రీట్ చేసిన తాజా స్టడీలో ఒక షాకింగ్ విషయం వెలుగుచూసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డేటా సెంటర్లలో దాదాపు 79 శాతం కెపాసిటీ.. వరదలు, అడవి మంటలు, తుఫానులు, విపరీతమైన ఎండలు వచ్చే ప్రమాదకరమైన వాతావరణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. దీనివల్ల డేటా సెంటర్ల నిర్వహణ కష్టమవ్వడమే కాకుండా, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, రిపేర్ ఖర్చులు కంపెనీలకు భారీ భారంగా మారుతున్నాయి. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిపుణుల ప్రకారం.. ఇప్పుడు వాతావరణ ముప్పు అనేది వస్తుందా లేదా అనే సవాలు కాదు, ఆ ముప్పును టెక్ కంపెనీలు ఎంతవరకు ముందే గుర్తించి మేనేజ్ చేయగలవనేదే అసలైన ప్రశ్న.
మరో ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. జ్యూరిచ్ ఇన్సూరెన్స్ నివేదిక ప్రకారం, ప్రస్తుతం నిర్మితమవుతున్న కొత్త డేటా సెంటర్లలో దాదాపు 64 శాతం సాంప్రదాయక సురక్షిత ప్రాంతాలను విడిచిపెట్టి వేరే ప్రాంతాల్లో కడుతున్నారు. ఇందులో విపరీతమైన ఎండలు, వడగళ్ల వానలు, తుఫానులు వచ్చే ప్రమాదం ఉన్న లొకేషన్లు కూడా ఉన్నాయి. అందువల్ల, ఇప్పటికైనా వాతావరణ మార్పులను నిర్లక్ష్యం చేయకుండా డేటా సెంటర్లను డిజైన్ చేసేటప్పుడు వాతావరణ పరిస్థితులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Samsung : నీరు, ధూళిని తట్టుకునే పవర్ఫుల్ బాడీ.. భారత్లో శామ్సంగ్ గెలాక్సీ M47 5G విడుదల
ఈ గ్లోబల్ వాతావరణ సంక్షోభాన్ని తట్టుకునేందుకు మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు ముందే అప్రమత్తమయ్యాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తమ డేటా సెంటర్లను రీ-డిజైన్ చేస్తున్నాయి. సరైన స్థలాన్ని ఎంచుకోవడం, రియల్ టైమ్ మానిటరింగ్, పటిష్టమైన పవర్ బ్యాకప్ సిస్టమ్స్ ద్వారా ఎండల ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయి.
మరోవైపు, ప్రముఖ గ్రాఫిక్స్, ఏఐ చిప్స్ తయారీ సంస్థ ఎన్విడియా సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసింది. తమ కొత్త ఏఐ సర్వర్లు బయట 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ.. అందులోని కూలింగ్ లిక్విడ్ సాయంతో సమర్థవంతంగా పనిచేస్తాయని తెలిపింది. ఉష్ణోగ్రతను కేవలం 1 డిగ్రీ పెంచడం ద్వారా కూలింగ్ కోసం అయ్యే విద్యుత్ ఖర్చులో దాదాపు 4 శాతం ఆదా చేయవచ్చని కంపెనీ నిరూపించింది. రాబోయే రోజుల్లో ఏఐ ఇండస్ట్రీలో వచ్చే ఇలాంటి సరికొత్త ఇన్నోవేషన్లు మాత్రమే క్లైమేట్ చేంజ్ సవాళ్లను ఎదుర్కొని డిజిటల్ ప్రపంచాన్ని కాపాడగలవని నిపుణులు నమ్ముతున్నారు.
ప్రకటన
ప్రకటన