Cell Broadcast Emergency alert system suspended: జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ జారీ చేసిన అధికారిక ఆదేశాల ప్రకారం.. జూన్ 12 నుంచి తదుపరి నోటీసు వచ్చేవరకు ఈ అత్యవసర అలర్ట్ సేవలు నిలిపివేయబడతాయి
Photo Credit: Unsplash/ Dominic Wajda
Cell Broadcast System
Cell Broadcast Emergency alert System Suspended: ప్రకృతి విపత్తులు, తుఫానులు, అత్యవసర పరిస్థితులు సంభవించినప్పుడు దేశ ప్రజలను క్షణాల్లో అప్రమత్తం చేసేందుకు భారత ప్రభుత్వం మే 2026 లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సెల్ బ్రాడ్కాస్ట్ సిస్టమ్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన కేవలం ఒక నెల రోజుల్లోనే దీనిపై కేంద్రం హోల్డ్ విధించడం టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ జారీ చేసిన అధికారిక ఆదేశాల ప్రకారం.. జూన్ 12 నుంచి తదుపరి నోటీసు వచ్చేవరకు ఈ అత్యవసర అలర్ట్ సేవలు నిలిపివేయబడతాయి.
ఈ సేవలను అకస్మాత్తుగా ఆపేయడం వెనుక ఉన్న ఖచ్చితమైన సాంకేతిక కారణాలను ప్రభుత్వం బహిరంగంగా వెల్లడించలేదు. కేవలం అధికారుల మధ్య కొన్ని అంతర్గత సమస్యలు తలెత్తడం వల్లే తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎన్డీఎంఏ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ది హిందూ పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం.. ఒక విపత్తు అలర్ట్ పొరపాటున అర్ధరాత్రి వేళ ఏకంగా దేశ ప్రధానమంత్రి మొబైల్ నంబర్కు వెళ్లడంతోనే ఉన్నతాధికారులు అలర్ట్ అయి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ ప్రచారానికి సంబంధించి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు.
ఈ సెల్ బ్రాడ్కాస్ట్ సిస్టమ్ డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సాధారణ మెసేజ్ లా కాకుండా.. ఈ అలర్ట్ వచ్చినప్పుడు యూజర్ల మొబైల్ ఫోన్లు సైలెంట్ మోడ్లో ఉన్నప్పటికీ.. అత్యంత వేగంగా, పెద్ద శబ్దంతో కూడిన అలర్ట్ టోన్ ప్లే అవుతుంది. అలాగే స్క్రీన్ పై ఎమర్జెన్సీ పాప్-అప్ మెసేజ్ కనిపిస్తుంది. జూన్ 12 రాత్రి హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల విపత్తు నిర్వహణ విభాగాలు కొన్ని టెస్టింగ్ అలర్ట్లను పంపించాయి. దీనివల్ల ఆ ప్రాంతాల్లోని లక్షలాది మంది ప్రజల ఫోన్లు అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మోగడంతో చాలా మంది యూజర్లు భయాందోళనకు గురయ్యారు.
Amazon : జూన్ 18 వరకే ఛాన్స్.. అమెజాన్లో ల్యాప్టాప్లు, టాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
మనం సాధారణంగా వాడే ఎస్ఎమ్ఎస్ అలర్ట్లతో పోలిస్తే ఈ సెల్ బ్రాడ్కాస్ట్ సిస్టమ్ ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఈ సిస్టమ్ పనిచేయడానికి ఎలాంటి ఇంటర్నెట్ లేదా మొబైల్ డేటా అవసరం లేదు. తుఫానులు లేదా వరదలు వచ్చినప్పుడు మొబైల్ నెట్వర్క్లు జామ్ అయిపోయినప్పటికీ.. సెల్యులార్ టవర్ల ద్వారా నేరుగా సిగ్నల్స్ పంపి ఈ అలర్ట్లను పంపవచ్చు. టెలికాం శాఖ సమాచారం ప్రకారం.. ప్రమాద ప్రాంతంలో ఉన్న లక్షలాది మంది మొబైల్ వినియోగదారులకు కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఈ సమాచారాన్ని చేరవేయడం దీని ప్రత్యేకత.
ఈ అత్యవసర సందేశం మొబైల్ స్క్రీన్పై ఒక విభిన్నమైన నోటిఫికేషన్లా కనిపిస్తుంది. యూజర్ ఆ మెసేజ్ చూసి ఓకే అని క్లిక్ చేసే వరకు ఆ పెద్ద శబ్దం వస్తూనే ఉంటుంది. దీనివల్ల ప్రమాద సమయంలో ప్రజల దృష్టిని వెంటనే ఆకర్షించవచ్చు. కొన్ని అధునాతన స్మార్ట్ఫోన్లలో ఈ మెసేజ్ను స్క్రీన్పై చూపించడమే కాకుండా.. చదవడం రాని వారి కోసం వాయిస్ రూపంలో గట్టిగా చదివి వినిపించే సదుపాయం కూడా ఉంది. ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ టెక్నాలజీ ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. మనదేశంలో కూడా దీనిలోని లోపాలను సరిదిద్ది, త్వరలోనే మళ్లీ పునఃప్రారంభించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రకటన
ప్రకటన