ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ అయిన మెటా తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో ఏకంగా 10 శాతం మందిని తొలగించేందుకు ప్లాన్ సిద్ధం చేసింది.
Photo Credit: Reuters
Meta told employees the company plans to move 7,000 employees to new AI initiatives
Tech Layoffs : ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ఉద్యోగాల కోత ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ అయిన మెటా తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో ఏకంగా 10 శాతం మందిని తొలగించేందుకు ప్లాన్ సిద్ధం చేసింది. దీని ప్రకారం దాదాపు 8,000 మంది ఉద్యోగులు రోడ్డున పడనున్నారు. ఈ వారంలోనే (బుధవారం నాడే) ఈ లేఆఫ్స్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతకు ప్రాధాన్యత ఇస్తూ, కంపెనీ ఇంటర్నల్ వర్క్ఫ్లోను పూర్తిగా మార్చేయడానికే ఈ భారీ నిర్ణయం తీసుకున్నట్లు మెటా చీఫ్ పీపుల్ ఆఫీసర్ జానెల్ గేల్ ఉద్యోగులకు పంపిన ఒక అంతర్గత మెమోలో స్పష్టం చేశారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటూ ఆదేశాలు
రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఈ వారంలో జరగబోయే లేఆఫ్స్, అంతర్గత బదిలీల వల్ల కంపెనీలోని మొత్తం వర్క్ఫోర్స్లో దాదాపు 20 శాతం మందిపై ప్రభావం పడనుంది. ఇప్పటికే కొందరు ఉద్యోగులను కొత్త విభాగాల్లోకి మార్చగా.. ఉద్యోగాలు కోల్పోయే మిగిలిన వారికి బుధవారం నాడు అధికారికంగా ఈమెయిల్స్ పంపనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఉత్తర అమెరికాలో పనిచేస్తున్న మెటా ఉద్యోగులందరినీ బుధవారం నాడు ఆఫీసులకు రాకుండా, కేవలం వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని కంపెనీ మేనేజ్మెంట్ ఆదేశించడం ఐటీ వర్గాల్లో సంచలనంగా మారింది. మార్చి చివరి నాటికి కంపెనీ రికార్డుల ప్రకారం మెటాలో 77,986 మంది ఉద్యోగులు ఉండగా.. తాజా నిర్ణయంతో పాటు కొత్తగా భర్తీ చేయాల్సిన మరో 6,000 ఓపెన్ పొజిషన్లను కూడా కంపెనీ శాశ్వతంగా క్లోజ్ చేసింది.
మనుషుల ఉద్యోగాలకు ఎసరు పెడుతున్న ఏఐ ఏజెంట్లు
ఈసారి మెటా చేస్తున్న లేఆఫ్స్ కేవలం ఖర్చులు తగ్గించుకోవడానికి మాత్రమే కాదు.. కంపెనీని పూర్తిగా ఏఐ నేటివ్ సంస్థగా మార్చడానికి జరుగుతున్న భారీ ప్రక్షాళన. కంపెనీ మేనేజరియల్ స్థానాలను తగ్గించి, చిన్న చిన్న టీమ్లతో నేరుగా పనులు పూర్తి చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే సుమారు 7,000 మంది ఉద్యోగులను ఏఐ విభాగాల్లోకి బదిలీ చేస్తున్నారు. మెటా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఆండ్రూ బోస్వర్త్ గతంలో ప్రకటించిన అప్లైడ్ ఏఐ ఇంజనీరింగ్, ఏజెంట్ ట్రాన్స్ఫార్మేషన్ యాక్సిలరేటర్ వంటి ప్రాజెక్ట్లపై వీరు పనిచేయనున్నారు. ప్రస్తుతం మనుషులు చేస్తున్న పనులను ఆటోమేటిక్ గా పూర్తి చేసే ఏఐ ఏజెంట్లను తయారు చేయడమే ఈ టీమ్స్ ముఖ్య ఉద్దేశం. అంటే భవిష్యత్తులో మనుషుల అవసరం లేకుండా ఏఐతోనే పనులు చేయించుకునేందుకు మెటా పునాది వేస్తోంది.
మెటా ఆఫీసుల్లో ఉద్యోగుల తిరుగుబాటు
కంపెనీ తీసుకున్న ఈ హఠాత్ నిర్ణయాలపై మెటా ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెటా ఆఫీసుల్లో, వాష్ రూమ్లలో, వెండింగ్ మిషన్లపై యాజమాన్యానికి వ్యతిరేకంగా అనామక ఫ్లైయర్స్ (పోస్టర్లు) అంటించి నిరసన తెలుపుతున్నారు. దీనికి తోడు కంపెనీ ప్రవేశపెట్టిన మోడల్ కేపబిలిటీ ఇనిషియేటివ్ అనే సాఫ్ట్వేర్పై పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది. ఉద్యోగుల ల్యాప్టాప్లలోని మౌస్ మూవ్మెంట్స్, కీబోర్డ్ కీస్, స్క్రీన్షాట్లను ఈ సాఫ్ట్వేర్ దొంగతనంగా ట్రాక్ చేస్తోంది. మనుషులు కంప్యూటర్ను ఎలా వాడుతున్నారో ఏఐ మోడళ్లకు ట్రైనింగ్ ఇవ్వడానికి మెటా ఈ నిఘా వేస్తోంది. ఇది తమ వ్యక్తిగత ప్రైవసీని దెబ్బతీయడమే కాకుండా, భవిష్యత్తులో తమను ఉద్యోగాల నుంచి తీసేయడానికే ఈ డేటాను వాడుకుంటారని మండిపడుతూ ఇప్పటికే 1,000 మందికి పైగా ఉద్యోగులు ఈ సాఫ్ట్వేర్ను తొలగించాలంటూ ఒక పిటిషన్పై సంతకాలు చేశారు.
ఏడాది కాలంగా దాగుడుమూతలు..
ఈ లేఆఫ్స్ గురించిన వార్తలు దాదాపు నెల రోజుల క్రితమే రాయిటర్స్ వార్తా సంస్థ ద్వారా బయటకు వచ్చినప్పటికీ, మెటా ఉన్నతాధికారులు మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయకుండా మౌనంగా దాటవేస్తూ వచ్చారు. కనీసం దీనిపై స్పష్టత ఇవ్వాలంటూ ఉద్యోగులు కంపెనీ అంతర్గత కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ వర్క్ప్లేస్లో అధికారుల పోస్టుల కింద ఏనుగు (Elephant in the room) బొమ్మలను కామెంట్లుగా పెడుతూ నిరసన వ్యక్తం చేశారు. కాగా, ఈ వారంలో జరగబోయే ఈ లేఆఫ్స్ పరిణామాలపై స్పందించేందుకు మెటా అధికార ప్రతినిధి నిరాకరించారు. ఐటీ ఇండస్ట్రీ నిపుణుల ప్రకారం.. కేవలం మెటా మాత్రమే కాదు.. అమెజాన్, స్నాప్ వంటి పలు పెద్ద టెక్ కంపెనీలు కూడా తమ బడ్జెట్లను ఏఐ వైపు మళ్లిస్తూ ఈ ఏడాది భారీగా ఉద్యోగాల కోత విధిస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy S27 Series Tipped to Include New Pro Model; Galaxy S27 Ultra Said to Offer Hardware Upgrades