Kudankulam Nuclear Plant Data leaked in Dark Web: వరల్డ్ లీక్స్ అనే ప్రమాదకరమైన అంతర్జాతీయ రాన్సమ్ వేర్ హ్యాకర్ల ముఠా ఈ డేటా చోరీకి పాల్పడినట్లు క్లెయిమ్ చేసింది.
Photo Credit: Unsplash/ Desola Lanre-Ologun
Cyber Crime
Kudankulam Nuclear Plant Data leaked in dark web: భారతదేశ రక్షణ, ఇంధన భద్రతకు సంబంధించి ఒక అత్యంత ఆందోళనకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం అయిన తమిళనాడులోని కుడంకుళం న్యూక్లియర్ పవర్ ప్లాంట్కు సంబంధించిన అత్యంత సున్నితమైన, రహస్య పత్రాలు ఇంటర్నెట్లోని డార్క్ వెబ్లో లీక్ అయినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ సమాచారం బయటకు రావడం దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలను, ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశ రక్షణకు గుండెకాయ లాంటి అణు ప్లాంట్ వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కడం భద్రతా సంస్థలను ఉలిక్కిపడేలా చేసింది.
రాయిటర్స్ నివేదిక ప్రకారం.. వరల్డ్ లీక్స్ అనే ప్రమాదకరమైన అంతర్జాతీయ రాన్సమ్ వేర్ హ్యాకర్ల ముఠా ఈ డేటా చోరీకి పాల్పడినట్లు క్లెయిమ్ చేసింది. అయితే, ఈ హ్యాకర్లు సేకరించిన పత్రాలన్నీ ప్రముఖ భారతీయ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ గ్రూప్కు చెందినవిగా పేర్కొన్నారు. ఈ సంచలన విషయంపై రిలయన్స్ గ్రూప్ వెంటనే స్పందిస్తూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. తాము డేటా భద్రత కోసం వాడుతున్న థర్డ్-పార్టీ డేటా సెంటర్ సర్వీస్ ప్రొవైడర్ యోట్టా సర్వర్లపై సైబర్ దాడి జరిగిందని, అక్కడ భద్రపరిచిన తమ డేటా కొంతవరకు హ్యాకింగ్కు గురైందని కంపెనీ అంగీకరించింది. ఈ సైబర్ సెక్యూరిటీ బ్రీచ్ ఘటనపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు సమాచారం అందించినట్లు రిలయన్స్ స్పష్టం చేసింది. అయితే ఏయే వివరాలు చోరీకి గురయ్యాయనే దానిపై పూర్తి స్పష్టత ఇవ్వలేదు.
Redmi Note 17 : మార్కెట్లోకి సరికొత్త రెడ్మి నోట్ 17 సిరీస్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
సైబర్ నిపుణులు లీకైన డేటాను పరిశీలించగా.. ఇవన్నీ 2016 సంవత్సరం నుంచి 2025 మధ్య కాలానికి సంబంధించిన కీలక పత్రాలుగా గుర్తించారు. లీకైన మొత్తం 8.58 లక్షల ఫైళ్లలో దాదాపు 19,000 ఫైళ్లు అత్యంత కీలకమైనవని హ్యాకర్లు ప్రకటించారు. ఈ ఫైళ్లలో కుడంకుళం అణు ప్లాంట్కు సంబంధించిన కొన్ని భాగాల బ్లూప్రింట్లు (ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్లు), యంత్రాల తనిఖీ నివేదికలు, అంతర్గత సమావేశాల రికార్డులు, ఇన్సూరెన్స్ పత్రాలు, ప్లాంట్కు విడిభాగాలు సరఫరా చేసే సప్లయర్స్ రహస్య సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం దేశంలో అణు విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో కుడంకుళం ప్లాంట్ అత్యంత కీలకమైనది. కాగా, 2018లో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఈ ప్లాంట్లోని యూనిట్-3, యూనిట్-4 నిర్మాణ డిజైన్ల కాంట్రాక్టును దక్కించుకోవడం గమనార్హం.
ఈ డేటా లీకేజీకి కారణమైన వరల్డ్ లీక్స్ రాన్సమ్ వేర్ ముఠా గతంలోనూ ఇలాంటి పెద్ద పెద్ద సైబర్ దాడులకు పాల్పడి వార్తల్లో నిలిచింది. సరిగ్గా గత జూన్ నెలలో ఈ ముఠా భారతదేశపు మరో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం టాటా గ్రూప్ సర్వర్లను హ్యాక్ చేసి, డేటాను తిరిగి ఇచ్చేందుకు ఏకంగా 15 లక్షల డాలర్ల (సుమారు రూ.12 కోట్లకు పైగా) భారీ మొత్తాన్ని డిమాండ్ చేసింది. తాము అడిగిన డబ్బులు ఇవ్వకపోవడంతో, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలైన ఆపిల్, టెస్లా సంస్థలకు సంబంధించిన అత్యంత రహస్యమైన డిజైన్ డాక్యుమెంట్లను పబ్లిక్ ప్లాట్ఫామ్లలో పెట్టేసామని ఈ ముఠా గతంలోనే ప్రకటించింది. డిజిటల్ యుగంలో బ్యాంకింగ్, రక్షణ రంగాలు ఎంత ప్రమాదంలో ఉన్నాయో ఈ వరుస హ్యాకింగ్ ఘటనలు నిరూపిస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన