ప్రపంచంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ డేటా సెంటర్ను చైనాలోని షాంఘై నగరంలో అధికారికంగా ప్రారంభించారు.
Photo Credit: Pexels/Sergei Starostin
Underwater Data Center
Data Center : ప్రస్తుత ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. దీనితో పాటు ఏఐ టెక్నాలజీని రన్ చేయడానికి అవసరమైన డేటా సెంటర్ల సంఖ్య కూడా అంతే వేగంగా పెరుగుతోంది. అయితే ఇందులో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే.. ఈ డేటా సెంటర్లు నడవడానికి భారీ ఎత్తున స్థలం, విద్యుత్ శక్తి మరియు అపారమైన వనరులు అవసరమవుతాయి. దీనివల్ల పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతోంది. అయితే ఈ గ్లోబల్ సమస్యకు చైనా దేశం ఒక అద్భుతమైన మార్గాన్ని కనిపెట్టింది. భూమిపై స్థలంతో పనిలేకుండా ఏకంగా నీటి అడుగున డేటా సెంటర్ను నిర్మించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.
షాంఘై సముద్ర గర్భంలో చైనా అద్భుత ప్రాజెక్ట్
ప్రపంచంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ డేటా సెంటర్ను చైనాలోని షాంఘై నగరంలో అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు షాంఘై లింగాంగ్ అండర్ సీ డేటా సెంటర్ డెమోన్స్ట్రేషన్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు. తూర్పు షాంఘైలోని హైటెక్ ఫ్రీ-ట్రేడ్ జోన్ అయిన లింగాంగ్ సమీపంలో ఈ ఫెసిలిటీని ఏర్పాటు చేశారు. ప్రపంచ ప్రసిద్ధ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు చెందిన గిగాఫ్యాక్టరీ కూడా ఇదే ప్రాంతంలో ఉండటం విశేషం. ఈ డేటా సెంటర్ సముద్ర మట్టానికి దాదాపు 10 మీటర్ల లోతున నీటి అడుగున స్థిరంగా పనిచేస్తోంది.
ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో భారీ బడ్జెట్ నిర్మాణం
ఈ అత్యాధునిక అండర్ వాటర్ డేటా సెంటర్ నిర్మాణం గత ఏడాది అక్టోబర్ నెలలోనే పూర్తయింది. కాగా ఈ ఏడాది మే నెల నుంచి దీని అధికారిక ఆపరేషన్స్ ప్రారంభమయ్యాయి. ప్రైవేట్ టెక్ సంస్థ హైక్లౌడ్ టెక్నాలజీ, చైనా ప్రభుత్వ రంగానికి చెందిన చైనా కమ్యూనికేషన్స్ కన్స్ట్రక్షన్ కంపెనీ సంయుక్తంగా ఈ మెగా ప్రాజెక్టును రూపకల్పన చేశాయి. దీని నిర్మాణానికి చైనా ప్రభుత్వం సుమారు 225 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.1,800 కోట్లు) ఖర్చు చేసింది. ప్రస్తుతం ఈ డేటా సెంటర్ మొత్తం సామర్థ్యం 24 మెగావాట్లుగా ఉంది.
విద్యుత్ వినియోగంలో భారీ ఆదా
సాధారణంగా భూమిపై నిర్మించే డేటా సెంటర్లతో పోలిస్తే, ఈ అండర్ వాటర్ డేటా సెంటర్ ఏకంగా 22 శాతం తక్కువ విద్యుత్ను వినియోగిస్తుందని చైనా ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల సముద్రంలో ఉన్న ఆఫ్షోర్ విండ్ ఫార్మ్స్ సహాయంతో దాదాపు 95 శాతం స్వచ్ఛమైన గ్రీన్ ఎనర్జీతోనే నడుస్తోంది. దీనివల్ల బొగ్గు లేదా ఇతర ఇంధనాల ద్వారా వచ్చే కాలుష్య విద్యుత్పై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతోంది.
IRCTC : రైలు ప్రయాణికులకు అదిరిపోయే ట్రిక్.. మీ మొబైల్ లోనే ఖాళీ బర్త్ల వివరాలు
కూలింగ్ కోసం నీటి వృధాకు శాశ్వతంగా చెక్
ప్రపంచవ్యాప్తంగా ఉన్న డేటా సెంటర్లలో సర్వర్లు రాత్రింబవళ్లు సమాచారాన్ని ప్రాసెస్ చేస్తూ విపరీతంగా వేడెక్కిపోతుంటాయి. వాటిని చల్లబరచడానికి ప్రతిరోజూ లక్షలాది లీటర్ల స్వచ్ఛమైన మంచి నీరు అవసరమవుతుంది. ఇది భూమిపై పెద్ద నీటి సంక్షోభానికి దారితీస్తోంది. కానీ చైనా నిర్మించిన ఈ సరికొత్త సముద్రగర్భ డేటా సెంటర్.. భూమిపై ఉండే సెంటర్ల కంటే ఏకంగా 90 శాతం తక్కువ నీటిని వాడుకుంటుంది. ఎందుకంటే ఈ డేటా సెంటర్ నిరంతరం సముద్రపు చల్లటి నీటిలోనే మునిగి ఉండటం వల్ల, చుట్టూ ఉండే సహజమైన నీటి ఉష్ణోగ్రతే సర్వర్లను ఎల్లప్పుడూ చల్లగా ఉంచుతుంది. దీనివల్ల అదనపు ఏసీలు లేదా కూలింగ్ ప్లాంట్ల అవసరం లేకుండా విద్యుత్, నీరు భారీగా ఆదా అవుతున్నాయి.
రాబోయే రోజుల్లో నీటి సంక్షోభం నుంచి విముక్తి
భవిష్యత్తులో రాబోయే భయంకరమైన నీటి సంక్షోభాన్ని అడ్డుకోవడానికి చైనా తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో కీలకమైనది. ఐక్యరాజ్యసమితికి చెందిన వాటర్, ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం.. రాబోయే 2030 సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న డేటా సెంటర్ల నీటి వినియోగం ఏకంగా 9.3 ట్రిలియన్ లీటర్లకు చేరుకోనుంది. ఈ నీరు సబ్-సహారా ఆఫ్రికాలోని 130 కోట్ల మంది ప్రజల వార్షిక గృహ అవసరాలకు సమానం. ఇలాంటి విపత్కర పరిస్థితులు రాకముందే చైనా సముద్ర గర్భంలో విజయవంతంగా నిర్మించిన ఈ అండర్ వాటర్ డేటా సెంటర్ టెక్నాలజీ.. భవిష్యత్తు ఇంటర్నెట్ ప్రపంచానికి దిక్సూచిగా మారబోతోంది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy S25 Gets New Galaxy AI Features From Galaxy S26 With New One UI 8.5 Update