Social Media Curfew in United Kingdom for Teens: ఇందులో భాగంగా 16, 17 సంవత్సరాల వయసున్న సోషల్ మీడియా వినియోగదారుల కోసం డిఫాల్ట్ పద్ధతిలో ఓవర్నైట్ కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
Photo Credit: Unsplash/ julianchrist
Social Media Curfew in United Kingdom for Teens: సోషల్ మీడియా యుగంలో కౌమారదశలో ఉన్న పిల్లల ఆన్లైన్ భద్రత, వారి మానసిక ఆరోగ్యంపై బ్రిటన్ ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. నేటి యువత అర్ధరాత్రి వరకు మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతూ నిద్ర, చదువు పాడు చేసుకుంటుండటంతో దీనికి అడ్డుకట్ట వేయాలని నిశ్చయించింది. ఇందులో భాగంగా 16, 17 సంవత్సరాల వయసున్న సోషల్ మీడియా వినియోగదారుల కోసం డిఫాల్ట్ పద్ధతిలో ఓవర్నైట్ కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీనితో పాటు యూజర్లను ఎక్కువ సమయం స్క్రీన్ వైపు చూసేలా ఆకర్షించే పలు రకాల ఫీచర్లను కూడా డిఫాల్ట్గా నిలిపివేయాలని బ్రిటన్ ప్రభుత్వం ఆదేశించింది.
అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 6 వరకు నో యాప్స్..
ఈ కొత్త నిబంధనల ప్రకారం 16, 17 ఏళ్ల వయసున్న టీనేజర్ల సోషల్ మీడియా ఖాతాలపై ప్రతిరోజూ అర్ధరాత్రి 12:00 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6:00 గంటల వరకు డిఫాల్ట్ కర్ఫ్యూ వర్తిస్తుంది. అంటే ఈ నిర్దేశిత సమయంలో సదరు యాప్ల వాడకం పూర్తిగా పరిమితం చేయబడుతుంది. అయితే, ప్రభుత్వం ఇందులో ఒక చిన్న మినహాయింపును కూడా ఇచ్చింది. ఈ వయసున్న టీనేజర్లు గనక ఇష్టపడితే, వారి ఫోన్ లోని సెట్టింగ్స్ మార్చుకోవడం ద్వారా ఈ కర్ఫ్యూను నిలిపివేయవచ్చు. అంటే ఇది సోషల్ మీడియాపై శాశ్వత నిషేధం కాదు, కేవలం పిల్లల రక్షణ కోసం డిఫాల్ట్గా వచ్చే ఒక సేఫ్టీ ఫీచర్ మాత్రమే.
రీల్స్ పిచ్చికి చెక్ పెట్టేలా కొత్త రూల్స్..
కేవలం సమయ నియంత్రణ మాత్రమే కాకుండా, యూజర్లు సోషల్ మీడియాలో నిరంతరం స్క్రోల్ చేస్తూ సమయాన్ని వృథా చేసేలా ప్రేరేపించే ఫీచర్లను కూడా నిలిపివేయాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఒకదాని తర్వాత ఒకటి ఆటోమేటిక్గా ప్లే అయ్యే ఆటో-ప్లే వీడియోస్, యూజర్ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా నిరంతరం కొత్త కంటెంట్ను చూపిస్తూ అడిక్ట్ చేసే పర్సనలైజ్డ్ ఫీడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ తరహా ఆల్గారిథమ్స్ వల్లే నేటి తరం పిల్లలు అవసరానికి మించి గంటల తరబడి సోషల్ మీడియాలో గడుపుతున్నారని ప్రభుత్వం బలంగా నమ్ముతోంది.
300 మంది కుటుంబాలపై పైలట్ ప్రాజెక్ట్..
ఈ చట్టాన్ని తీసుకురావడానికి ముందు బ్రిటన్ ప్రభుత్వం దాదాపు 300 మందికి పైగా టీనేజర్లు, వారి తల్లిదండ్రులతో ఒక ప్రత్యేక పైలట్ ప్రోగ్రామ్ను నిర్వహించింది. ఈ రాత్రి కర్ఫ్యూ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసిన కుటుంబాల నుంచి అద్భుతమైన ఫలితాలు వచ్చాయని ప్రభుత్వం తెలిపింది. ఈ పద్ధతి ద్వారా పిల్లల్లో నిద్రలేమి సమస్యలు తగ్గి నిద్ర వేళలు మెరుగయ్యాయని, చదువుపై ఏకాగ్రత పెరగడమే కాకుండా, ఇంట్లో కుటుంబ సభ్యులతో గడిపే సమయం కూడా గణనీయంగా పెరిగిందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
కేవలం సోషల్ మీడియానే కాదు..
బ్రిటన్ ప్రభుత్వం తన నిబంధనలను కేవలం సోషల్ మీడియా యాప్స్కే పరిమితం చేయడం లేదు. ఆ దేశ సాంకేతిక విభాగం సెక్రటరీ లిజ్ కెండల్ మాట్లాడుతూ.. త్వరలోనే చిన్న పిల్లల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్ల వినియోగానికి సంబంధించి కూడా కొత్త రక్షణ చట్టాలను తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఒకవేళ ఏవైనా ఏఐ చాట్బాట్లు పిల్లల మానసిక స్థితికి ముప్పుగా పరిణమిస్తే, వాటిపై శాశ్వత నిషేధం విధించే హక్కు కూడా ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేశారు. దీనితో పాటు పాఠశాలల్లో పిల్లలకు డిజిటల్ భద్రత, ఏఐ సాంకేతికతపై మరింత అవగాహన కల్పించనున్నారు.
Belkin : ఒకేసారి రెండు డివైజ్లు చార్జ్ చేసుకునే సదుపాయం.. బడ్జెట్ ధరలోనే అదిరిపోయే పవర్బ్యాంక్
స్కూల్ సిలబస్లోనే డిజిటల్ సేఫ్టీ..
ఈ ఏడాది సెప్టెంబర్ నెల నుంచి బ్రిటన్ లోని పాఠశాలల్లో రిలేషన్షిప్స్, సెక్స్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ (RSHE) క్లాసుల సిలబస్లో సరికొత్త మార్పులు చేయనున్నారు. ఇకపై ఈ క్లాసుల్లో ఏఐ, ఏఐ చాట్బాట్లు, ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారం వ్యాప్తి, ఆన్లైన్ లో మహిళలపై ద్వేషం, హింసను ప్రేరేపించే కంటెంట్ను ఎలా గుర్తించాలనే విషయాలపై విద్యార్థులకు ప్రత్యేక బోధన చేస్తారు. ఈ సరికొత్త సోషల్ మీడియా చట్టాల తాలూకు మొదటి ముసాయిదాను ఈ ఏడాది చివరి నాటికి బ్రిటన్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే 2027 వసంత కాలం నుంచి ఈ చట్టం దేశవ్యాప్తంగా అధికారికంగా అమలులోకి రానుంది.
ప్రకటన
ప్రకటన
Tom Clancy's Ghost Recon: Future Soldier Is Free to Claim on Ubisoft Store for a Week
Amazon Great Freedom Sale 2026: Best Deals on Refrigerators from Haier, LG, Samsung and More Brands