ఈ ఫీచర్లో అత్యంత ప్రమాదకరమైన అంశం ఏమిటంటే నేమ్ స్క్వాటింగ్.
Photo Credit: Meta
WhatsApp Username
WhatsApp : ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఈ ఏడాది చివర్లోగా ప్రపంచవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని చూస్తున్న సరికొత్త యూజర్నేమ్ ఫీచర్పై అప్పుడే పెద్ద ఎత్తున విమర్శలు, ఆందోళనలు మొదలయ్యాయి. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే, వినియోగదారులు తమ మొబైల్ నంబర్లను ఇతరులతో పంచుకోకుండానే కేవలం యూజర్నేమ్ ద్వారా చాటింగ్ చేసుకోవచ్చు. దీనివల్ల నంబర్ బయటకు పొక్కకుండా ప్రైవసీ పెరుగుతుందని, సిమ్ స్వాపింగ్ లేదా కాంటాక్ట్ స్క్రాపింగ్ లాంటి సైబర్ మోసాల నుంచి రక్షణ లభిస్తుందని ఎకనామిక్ టైమ్స్ నివేదిక పేర్కొంది. అయితే నాణేనికి మరో వైపు ఉన్నట్లుగా.. ఈ ఫీచర్ వల్ల దేశంలో సరికొత్త సైబర్ నేరాలకు దారులు తెరుచుకుంటాయని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నేమ్ స్క్వాటింగ్తో పొంచి ఉన్న అసలు ప్రమాదం
ఈ ఫీచర్లో అత్యంత ప్రమాదకరమైన అంశం ఏమిటంటే నేమ్ స్క్వాటింగ్. అంటే, ఒక ప్రముఖ వ్యక్తి లేదా బ్రాండ్ పేరును ఇతరులు ముందే దొంగిలించి, ఆ యూజర్నేమ్ను తమ పేరిట రిజర్వ్ చేసుకోవడం. సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు పెట్టిన పోస్టుల ప్రకారం.. ఇప్పటికే కొందరు చాకచక్యంగా @PmNarendraModi, @KunalShahReal వంటి అత్యంత కీలకమైన యూజర్నేమ్స్ను వాట్సాప్లో రిజర్వ్ చేసుకోవడంలో విజయవంతమయ్యారు. భవిష్యత్తులో సైబర్ నేరగాళ్లు ఇలాంటి అధికారిక లేదా సెలబ్రిటీల పేర్లతో ఉండే యూజర్నేమ్స్ను వాడుకుని, తాము అసలైన వ్యక్తులమేనంటూ ప్రజలను నమ్మించి, నకిలీ గుర్తింపుతో పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడే అవకాశం ఉందని నిపుణులు బల్లగుద్ది చెబుతున్నారు.
విజయ్ శేఖర్ శర్మ, అంకుర్ వారికూల ఆందోళన
భారతీయ స్టార్టప్ రంగానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఈ ఫీచర్పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ స్పందిస్తూ.. "త్వరలోనే వాట్సాప్లో వెరిఫైడ్ యూజర్నేమ్స్ వస్తాయి, కానీ వాటితో పాటే కన్ఫ్యూజ్ చేసేలా ఉండే అనేక అన్వెరిఫైడ్ (నకిలీ) యూజర్నేమ్స్ కూడా దర్శనమిస్తాయి" అని పేర్కొన్నారు. ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ అంకుర్ వారికూ ఎక్స్లో పోస్ట్ చేస్తూ.. ఒకవేళ వాట్సాప్ సరైన యాంటీ-అబ్యూస్ వ్యవస్థను ఏర్పాటు చేయకపోతే, భారతదేశం లాంటి పెద్ద దేశంలో ఇది ఒక విపత్తుగా మారుతుందని హెచ్చరించారు. మనకు వాట్సాప్లో @warikoo, @ankur_warikoo లేదా @ankurwarikooofficial లాంటి పేర్లతో మెసేజ్ పంపి డబ్బులు అడిగితే సామాన్య ప్రజలు మోసపోయే ప్రమాదం ఉందని ఆయన ఉదాహరణలతో వివరించారు. అలాగే మోబిక్విక్ సీఈఓ బిపిన్ ప్రీత్ సింగ్ కూడా ఇది మంచి ఐడియా కాదని, ఇప్పటికే తన పేరుతో ఉన్న పలు వేరియంట్లను ఎవరో రిజర్వ్ చేసుకున్నారని తెలిపారు.
Vivo : కెమెరా రంగంలో సరికొత్త విప్లవం.. డిఎస్ఎల్ఆర్ రేంజ్ ఫీచర్లతో వస్తున్న వివో X500 ప్రో మాక్స్
బిజినెస్ అకౌంట్లకు పెయిడ్ సర్వీస్?
ప్రస్తుతానికి మెటా సంస్థ ఈ యూజర్నేమ్ ఫీచర్ను ఉచితంగానే అందిస్తున్నప్పటికీ, భవిష్యత్తులో దీనిని ఒక ప్రీమియం సర్వీస్గా మార్చే యోచనలో ఉన్నట్లు టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా పెద్ద పెద్ద కంపెనీలు, బ్రాండ్లు తమ అధికారిక పేర్లను వేరొకరు దొంగిలించకుండా కాపాడుకోవడానికి ఈ యూజర్నేమ్స్ కోసం డబ్బులు చెల్లించాల్సి రావచ్చు. అయితే దీనిపై మెటా సంస్థ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు. సాధారణ వినియోగదారులకు మాత్రం ఇది ఉచితంగానే అందుబాటులోకి రానుంది.
ఫీచర్పై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం
ఈ వివాదంపై భారత ప్రభుత్వం కూడా అత్యంత అప్రమత్తమైంది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. వాట్సాప్ తీసుకురానున్న ఈ కొత్త ఫీచర్ వల్ల దేశంలో సైబర్ మోసాలు, నకిలీ గుర్తింపుల ముప్పు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని ఐటీ శాఖ అధికారులు భావిస్తున్నారు. అందుకే ఈ ఫీచర్ రోల్అవుట్ను నియంత్రించడానికి లేదా తాత్కాలికంగా నిలిపివేయడానికి ఉన్న చట్టపరమైన మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. ఈ ఫీచర్ మార్కెట్లోకి వచ్చే ముందే కంపెనీ కచ్చితమైన భద్రతా చర్యలు తీసుకునేలా నిబంధనలు విధించాలని చూస్తోంది. దేశంలో డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలను అరికట్టేందుకు అవసరమైతే సరికొత్త చట్టాన్ని కూడా తీసుకురావడానికి వెనకాడబోమని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
ప్రకటన
ప్రకటన