గత ఏడేళ్లుగా వాట్సాప్ను విజయవంతంగా నడిపించిన విల్ క్యాత్కార్ట్ ఈ పదవి నుంచి తప్పుకోవడంతో.. ఆ స్థానంలో మెటా యాజమాన్యం కునాల్ షాను ఎంపిక చేసింది.
Photo Credit: Kunal Shah
Kunal Shah
Kunal Shah : ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన మెసేజింగ్ ప్లాట్ఫారమ్ వాట్సాప్కు కొత్త గ్లోబల్ హెడ్గా ఒక భారతీయుడు నియమితులవడం అంతర్జాతీయ టెక్ రంగంలో పెద్ద సంచలనంగా మారింది. ప్రముఖ దేశీయ ఫిన్టెక్ స్టార్టప్ క్రెడ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఏంజెల్ ఇన్వెస్టర్ కునాల్ షా ఈ అత్యున్నత పదవిని చేపట్టబోతున్నారు. గత ఏడేళ్లుగా వాట్సాప్ను విజయవంతంగా నడిపించిన విల్ క్యాత్కార్ట్ ఈ పదవి నుంచి తప్పుకోవడంతో.. ఆ స్థానంలో మెటా యాజమాన్యం కునాల్ షాను ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో అసలు కునాల్ షా ఎవరు, ఆయన ప్రస్థానం ఎలా సాగింది అనే విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
ఫిలాసఫీ స్టూడెంట్ టు స్టార్టప్ కింగ్
మే 30, 1979న జన్మించిన కునాల్ షా బ్యాక్గ్రౌండ్ చాలా భిన్నమైనది. ఆయన ముంబైలోని విల్సన్ కాలేజీలో ఫిలాసఫీ అభ్యసించారు. ఆ తర్వాత నార్సీ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (NMIMS)లో పార్ట్ టైమ్ ఎంబీఏ కోర్సులో చేరినప్పటికీ, వ్యాపార రంగంపై ఉన్న ఆసక్తితో మధ్యలోనే ఆపేశారు. కునాల్ షా 2009లో పైసాబ్యాక్ అనే క్యాష్బ్యాక్, కస్టమర్ రివార్డ్స్ ప్లాట్ఫారమ్ను స్థాపించడం ద్వారా స్టార్టప్ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 2010లో సందీప్ టాండన్తో కలిసి దీనిని ఫ్రీఛార్జ్గా మార్చారు. భారతదేశంలో ఆన్లైన్ రీఛార్జ్లు, పేమెంట్స్ సంస్కృతిని విస్తరించడంలో ఫ్రీఛార్జ్ కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత 2015లో ఈ సంస్థను స్నాప్డీల్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.
ఏంజెల్ ఇన్వెస్టర్గా వందలాది స్టార్టప్లకు అండ
ఫ్రీఛార్జ్ విక్రయం తర్వాత కునాల్ షా భారతీయ స్టార్టప్ రంగానికి పెద్ద దిక్కుగా మారారు. ఆయన కేవలం వ్యాపారవేత్తగానే కాకుండా దేశంలోనే మోస్ట్ యాక్టివ్ ఏంజెల్ ఇన్వెస్టర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. నివేదికల ప్రకారం.. ఆయన ఇప్పటివరకు భారతదేశంలోని దాదాపు 250 కంటే ఎక్కువ స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టడమే కాకుండా వారికి మెంటార్గా వ్యవహరించారు. ఇందులో దేశీయ యూనికార్న్ సంస్థలైన భారత్పే, రేజర్పే వంటి దిగ్గజాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (IAMAI) ఛైర్మన్గా, పీక్ XV పార్ట్నర్స్ (గతంలో సెక్వోయా క్యాపిటల్ ఇండియా) సలహాదారుడిగా, పైన్ ల్యాబ్స్ బోర్డు మెంబర్గా వివిధ ఉన్నత పదవుల్లో పనిచేశారు. 2016లో ఫార్చ్యూన్ ఇండియా తన 40 అండర్ 40 జాబితాలో ఆయనకు చోటు కల్పించింది.
Emergency Alert : తప్పిపోయిన పిల్లలు, వృద్ధుల సమాచారం క్షణాల్లో మీ మొబైల్కు.. ఫోటోలతో సహా రానున్న మెసేజ్లు
క్రెడ్తో తిరుగులేని గుర్తింపు
ఆ తర్వాత 2018లో కునాల్ షా బెంగళూరు కేంద్రంగా క్రెడ్ అనే ప్రీమియం ఫిన్టెక్ ప్లాట్ఫారమ్ను ప్రారంభించారు. క్రెడిట్ కార్డ్ బిల్లులను సమయానికి చెల్లించే వినియోగదారులకు ప్రత్యేక రివార్డులు, కాయిన్స్ ఇచ్చే వినూత్నమైన ఆలోచనతో వచ్చిన ఈ యాప్.. చాలా తక్కువ సమయంలోనే దేశంలోనే అత్యంత గుర్తింపు పొందిన స్టార్టప్గా ఎదిగింది. ప్రస్తుతం క్రెడ్ తన సేవలను కేవలం బిల్లుల చెల్లింపులకే పరిమితం చేయకుండా లోన్లు, ఈ-కామర్స్, వివిధ ఆర్థిక సేవలకు విస్తరించింది. ఇప్పుడు వాట్సాప్ గ్లోబల్ హెడ్గా వెళ్తున్న తరుణంలో కునాల్ షా క్రెడ్ సీఈఓ పదవి నుంచి తప్పుకుంటున్నారు. ఆయన స్థానంలో మితేన్ సంపత్ తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు తీసుకోనున్నారు.
కునాల్ షాను మెటా ఎందుకు ఎంచుకుంది?
ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ యాప్ను నడపడానికి కునాల్ షాను ఎంచుకోవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని మెటా పేర్కొంది. వాట్సాప్ తదుపరి దశ వృద్ధికి కునాల్ షా లాంటి ఫౌండర్ మైండ్సెట్, లోతైన ప్రొడక్ట్ నాలెడ్జ్, టెక్నాలజీపై ఉన్న పట్టు ఎంతగానో అవసరమని కంపెనీ భావించింది. మెటా చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ క్రిస్ కాక్స్ స్వయంగా కునాల్ షాను సంప్రదించి ఈ ఆఫర్ ఇచ్చారు. మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ మాట్లాడుతూ.. "కునాల్ షా భారతదేశంలో అత్యంత కీలకమైన టెక్నాలజీ కంపెనీలలో ఒకటైన క్రెడ్ను నిర్మించారు. గ్లోబల్ డిజిటల్ మార్కెట్పై ఆయనకు ఉన్న అంతర్జాతీయ దృక్పథం, విజన్ ప్రపంచంలోనే అతిపెద్ద యాప్ అయిన వాట్సాప్ను విజయవంతంగా నడపడానికి ఎంతగానో ఉపయోగపడతాయి" అని కొనియాడారు. ఈ నియామకంతో పాటు మెటా సంస్థ క్రెడ్లో ఏకంగా 900 మిలియన్ డాలర్ల (సుమారు రూ.8,506 కోట్లు) వ్యూహాత్మక పెట్టుబడి పెట్టడం విశేషం.
ప్రకటన
ప్రకటన
Tom Clancy's Ghost Recon: Future Soldier Is Free to Claim on Ubisoft Store for a Week
Amazon Great Freedom Sale 2026: Best Deals on Refrigerators from Haier, LG, Samsung and More Brands