ఈ వివాదానికి ప్రధాన కారణం ట్రాయ్ 2024లో తీసుకొచ్చిన ఒక కొత్త రూల్.
Photo Credit: Truecaller
Truecaller vs TRAI : భారతదేశంలో మొబైల్ వినియోగదారులను వేధిస్తున్న స్ప్యామ్, నకిలీ కాల్స్ను అడ్డుకునేందుకు అమలు చేస్తున్న నిబంధనలు ఇప్పుడు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్, ప్రముఖ కాలర్ ఐడీ యాప్ ట్రూకాలర్ మధ్య తీవ్ర వివాదానికి దారితీశాయి. ట్రూకాలర్ ఇండియా సీఈఓ రిషిత్ ఝున్ఝున్వాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా ట్రాయ్ విధానాలపై బహిరంగంగానే ప్రశ్నలు సంధించారు. ప్రస్తుతం అమలులో ఉన్న ప్రభుత్వ నిబంధనల కారణంగా, వినియోగదారులకు వస్తున్న అనుమానాస్పద, మోసపూరిత కాల్స్ గురించి సరైన, ఖచ్చితమైన సమాచారాన్ని అందించలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కొత్త నిబంధనలను కొందరు కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుని లూప్హోల్స్ వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
వివాదానికి అసలు కారణం ఏంటి?
ఈ వివాదానికి ప్రధాన కారణం ట్రాయ్ 2024లో తీసుకొచ్చిన ఒక కొత్త రూల్. వ్యాపార ప్రకటనలు, సర్వీస్ కాల్స్ కోసం ట్రాయ్ ప్రత్యేకంగా రెండు నంబర్ సిరీస్లను కేటాయించింది. దీని ప్రకారం.. 1400 సిరీస్ నంబర్లను కేవలం టెలిమార్కెటింగ్ కాల్స్ కోసం, అలాగే 1600 సిరీస్ నంబర్లను బ్యాంకింగ్ లావాదేవీలు లేదా సర్వీస్ అప్డేట్స్ వంటి అవసరమైన కాల్స్ కోసం కేటాయించారు. ఈ నంబర్ల ద్వారా ప్రజలు ఏది కంపెనీ కాలో, ఏది నకిలీ కాలో సులభంగా గుర్తుపడతారని ట్రాయ్ భావించింది. అయితే, ఈ అధికారిక నంబర్లపై వినియోగదారులు ఫిర్యాదు చేసినా, నిబంధనల ప్రకారం వాటిపై స్పామ్ అని లేబుల్ వేయడానికి ట్రూకాలర్కు అనుమతి లేదు. దీనిని ఆసరాగా చేసుకుని కొన్ని సంస్థలు వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ట్రూకాలర్ అంటోంది.
8 నెలల్లో 7 కోట్ల కాల్స్ బ్లాక్
ట్రూకాలర్ సీఈఓ రిషిత్ ఝున్ఝున్వాలా తన వాదనకు మద్దతుగా కొన్ని షాకింగ్ గణాంకాలను బయటపెట్టారు. గత ఎనిమిది నెలల కాలంలో భారతీయ వినియోగదారులు 1400 సిరీస్ నుంచి వచ్చిన కాల్స్లో 81 శాతం, అలాగే 1600 సిరీస్ నుంచి వచ్చిన కాల్స్లో 79 శాతం కాల్స్ను కట్ చేశారని లేదా నిర్లక్ష్యం చేశారని తెలిపారు. అంతేకాకుండా, ఇదే కాలంలో యూజర్లు ఈ రెండు సిరీస్లకు చెందిన దాదాపు 7.4 కోట్ల కాల్స్ను మాన్యువల్గా బ్లాక్ చేశారని కంపెనీ వెల్లడించింది. నిబంధనల ప్రకారం ఈ నంబర్లను నేరుగా స్ప్యామ్ అని మార్క్ చేయలేకపోతున్నందున, వినియోగదారులను అప్రమత్తం చేయడానికి ట్రూకాలర్ ఇప్పుడు Frequently Blocked అనే సరికొత్త బ్యాజ్ను తీసుకువచ్చింది.
MySpeed App : మొబైల్లో ఫుల్ సిగ్నల్ ఉన్నా ఇంటర్నెట్ స్లోగా ఉందా? ఈ యాప్తో అసలు కారణం తెలుసుకోండి
ట్రూకాలర్కు చెక్ పెట్టేందుకు ట్రాయ్ కొత్త ఎత్తుగడ
మరోవైపు, 1400, 1600 సిరీస్లకు చెందిన కొన్ని అధికారిక నంబర్లను కూడా ట్రూకాలర్, హియా, హూస్కాల్ వంటి యాప్స్ స్పామ్ గా చూపిస్తుండటంపై ట్రాయ్ ఆగ్రహంతో ఉంది. ఇలాంటి థర్డ్ పార్టీ కాలర్ ఐడీ యాప్స్పై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా తమకు అదనపు చట్టపరమైన అధికారాలు కల్పించాలని ట్రాయ్ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, ఈ విషయంపై ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) ఇంకా ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా ట్రూకాలర్కు ఉన్న 50 కోట్ల మంది నెలవారీ యాక్టివ్ యూజర్లలో.. ఏకంగా 35 కోట్ల మందికి పైగా భారత్లోనే ఉన్నారు. కాబట్టి భారత ప్రభుత్వం తీసుకునే ఎలాంటి నిర్ణయమైనా ట్రూకాలర్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే కంపెనీ తన దగ్గర ఉన్న డేటాను ప్రభుత్వంతో పంచుకుని, వాస్తవాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతోంది.
ప్రకటన
ప్రకటన