నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) ఈ తాత్కాలిక నిషేధ ఉత్తర్వులను జారీ చేసింది.
Photo Credit: Reuters
NEET-UG 2026
Telegram : వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ సజావుగా సాగేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన ముందస్తు చర్య తీసుకుంది. దేశంలో అత్యంత పాపులర్ అయిన మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ యాక్సెస్పై తాత్కాలికంగా నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. పరీక్షకు సంబంధించిన నకిలీ వార్తలు, తప్పుడు పేపర్ లీకేజీ క్లెయిమ్లు, ఆన్లైన్ ఆర్థిక మోసాలను నిరోధించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కేవలం యాప్ను నిలిపివేయడమే కాకుండా, టెలిగ్రామ్లోని ముఖ్యమైన మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ను కూడా కొంతకాలం పాటు హోల్డ్లో పెట్టాలని ఆదేశాలు వచ్చాయి.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) ఈ తాత్కాలిక నిషేధ ఉత్తర్వులను జారీ చేసింది. ఎన్టీఏ ఇచ్చిన నివేదికలు, సిఫార్సుల ఆధారంగానే ఐటీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం టెలిగ్రామ్ సేవలపై ఈ నిషేధం జూన్ 22 వరకు అమల్లో ఉంటుంది. అలాగే టెలిగ్రామ్లో ఒకసారి పంపిన మెసేజ్ను మార్చుకునే మెసేజ్ ఎడిటింగ్ ఆప్షన్ను జూన్ 30 వరకు పూర్తిగా నిలిపివేయాలని కేంద్రం స్పష్టం చేసింది.
కొన్ని వ్యవస్థీకృత నేరగాళ్ల నెట్వర్క్లు టెలిగ్రామ్ వేదికగా విద్యార్థులను తీవ్రంగా గందరగోళానికి గురిచేస్తున్నాయని ఎన్టీఏ గుర్తించింది. వీరు పరీక్షల క్వశ్చన్ పేపర్లు లీక్ అయ్యాయంటూ నకిలీ ఆధారాలను సృష్టించడానికి టెలిగ్రామ్ గ్రూపులను వాడుతున్నారు. ముఖ్యంగా కొన్ని ఛానళ్ల అడ్మిన్లు పరీక్ష జరగడానికి కొన్ని రోజుల ముందే ఒక సాధారణ మెసేజ్ పెట్టి ఉంచుతారు. పరీక్ష ముగిసిన తర్వాత ఆ పాత మెసేజ్ను ఎడిట్ చేసి, అందులోకి ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ను యాడ్ చేస్తున్నారు. దీనివల్ల ఆ పోస్ట్ పాత టైమ్స్టాంప్ (మెసేజ్ పెట్టిన సమయం) అలాగే ఉంటుంది. దీనిని చూపిస్తూ.. ‘చూశారా మేము పరీక్షకంటే ముందే పేపర్ లీక్ చేశాం' అంటూ విద్యార్థులను నమ్మిస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
EPFO : ఆధార్ నంబర్ ఉంటే చాలు.. ఉమంగ్ యాప్ ద్వారా UAN తెలుసుకునే సింపుల్ ప్రాసెస్ ఇదే
ఈ తరహా మెసేజ్ ఎడిటింగ్ మోసాలకు అడ్డుకట్ట వేయడానికే ఈ ఫీచర్ను తాత్కాలికంగా బ్లాక్ చేసినట్లు ఎన్టీఏ వివరించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) కూడా ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించింది. టెలిగ్రామ్లో విద్యార్థులను మోసం చేస్తున్న పలు ఫేక్ ఛానళ్లు, గ్రూపులు, ఆటోమేటెడ్ బాట్స్ను గుర్తించి వాటిపై చర్యలు తీసుకున్నారు. కొన్ని ఛానళ్లు అయితే నీట్ రీ-ఎగ్జామ్ ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ ఇస్తామంటూ విద్యార్థుల నుంచి వేల రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు తేలింది. ఈ దందాలన్నీ పూర్తిగా నకిలీవని, క్వశ్చన్ పేపర్లు అత్యంత సురక్షితమైన లాకర్ల వెలుపల ఎక్కడా అందుబాటులో ఉండవని ఎన్టీఏ స్పష్టం చేసింది.
ఇలాంటి సోషల్ మీడియా మోసాలపై ఇప్పటికే బీహార్ పోలీసులు విద్యార్థులను అప్రమత్తం చేశారు. మరోవైపు, అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఒక అడుగు ముందుకు వేసి.. టెలిగ్రామ్ వేదికగా నకిలీ పేపర్ లీక్ దందా నడుపుతున్న ఒక అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశారు. దర్యాప్తు సంస్థల లెక్కల ప్రకారం ఈ ముఠా కేవలం ఒక నెల రోజుల్లోనే దాదాపు 1000 మంది మొబైల్ నంబర్లను కాంటాక్ట్ చేసి, సుమారు రూ.1.5 కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు తేలింది. విద్యార్థులు ఎవరూ ఇలాంటి మోసగాళ్లను నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని ఎన్టీఏ కోరింది. అలాగే, ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జూన్ 21న నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ ఖచ్చితంగా జరుగుతుందని, అప్డేట్స్ కోసం కేవలం ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ను మాత్రమే ఫాలో అవ్వాలని సూచించింది.
ప్రకటన
ప్రకటన