ఒకప్పుడు స్మార్ట్ఫోన్లు వాడటం, ఇంటర్నెట్లో వీడియోలు చూడటం అనేది కేవలం హైదరాబాద్, ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాలకే పరిమితం అనుకునేవారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది.
Photo Credit: Unsplash
The report sheds light on the types of content that are resonating with Indian audiences
Instagram : ఒకప్పుడు స్మార్ట్ఫోన్లు వాడటం, ఇంటర్నెట్లో వీడియోలు చూడటం అనేది కేవలం హైదరాబాద్, ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాలకే పరిమితం అనుకునేవారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. మన దేశంలో వీడియోల వినియోగం కేవలం సిటీలకే పరిమితం కాలేదని ప్రసిద్ధ సోషల్ మీడియా దిగ్గజం మెటా నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. ఇన్స్టాగ్రామ్ లో వచ్చే షార్ట్ వీడియోలు ఇప్పుడు భారతీయుల జీవితంలో ఒక భాగమైపోయాయి. సరికొత్త విషయాలను తెలుసుకోవడానికి, క్రియేటర్లను ఫాలో అవ్వడానికి, ఆన్లైన్ షాపింగ్ చేయడానికి కూడా ఈ రీల్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఈ నివేదిక స్పష్టం చేసింది.
మెటా సంస్థ ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ ఇప్సోస్ భాగస్వామ్యంతో భారతదేశంలోని 23 నగరాలు, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 4,000 మందిపై ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో తేలిన వివరాల ప్రకారం.. మన దేశంలో సోషల్ మీడియా వాడుతున్న వారిలో ఏకంగా 97 శాతం మంది ప్రతిరోజూ మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్) ప్లాట్ఫామ్స్లో వీడియోలు చూస్తున్నారు. నగరాల్లో ఈ వాటా 98 శాతంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఏమాత్రం తగ్గకుండా 94 శాతంగా నమోదైంది. దీన్ని బట్టి పట్టణాలకు, పల్లెటూళ్లకు మధ్య వీడియోల వినియోగంలో ఉన్న గ్యాప్ చాలావరకు తగ్గిపోయిందని అర్ధమవుతోంది.
ఈ వీడియోల హవాలో నేటి తరం యువత, మహిళలు ముందువరుసలో ఉన్నారు. సర్వేలో పాల్గొన్న యువతలో 97 శాతం మంది, మహిళల్లో 97 శాతం మంది ప్రతిరోజూ క్రమం తప్పకుండా వీడియోలు చూస్తున్నారు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ విషయానికి వస్తే.. 89 శాతం మంది యువతీ యువకులు, 85 శాతం మంది మహిళలు రోజువారీగా రీల్స్ చూస్తూ గడుపుతున్నారు. దీనివల్ల రీల్స్ అనేది కేవలం ఒక వినోద సాధనంగానే కాకుండా, సరికొత్త ట్రెండ్స్ను క్రియేట్ చేసే ప్లాట్ఫామ్గా మారిపోయిందని మెటా సంస్థ తెలిపింది.
ఈ సర్వేలో వెల్లడైన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రీల్స్ ఇప్పుడు వ్యాపారాలను, కొనుగోలుదారుల నిర్ణయాలను కూడా శాసిస్తున్నాయి. మెటా ఇండియా డైరెక్టర్ సౌగతో భౌమిక్ మాట్లాడుతూ.. రీల్స్ అనేది కేవలం కంటెంట్ కోసం మాత్రమే కాదు, ఇది కంటెంట్-టు-కామర్స్ గా మారిపోయిందని చెప్పారు. కస్టమర్లు రీల్స్ ద్వారా కొత్త వస్తువులను కనుగొనడం, వాటిపై నమ్మకం పెంచుకోవడం మరియు చివరకు వాటిని కొనాలని డిసైడ్ అవ్వడం జరుగుతోందని ఆయన వివరించారు. ఈ సర్వే ప్రకారం.. 81 శాతం మంది రీల్స్ ద్వారా కొత్త ప్రొడక్ట్స్ తెలుసుకుంటుండగా, 47 శాతం మంది రీల్స్ చూసిన తర్వాతే వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.
ఇతర షార్ట్ వీడియో యాప్స్తో పోలిస్తే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా క్రియేటర్లకు ఏకంగా 60 శాతం ఎక్కువ ఎంగేజ్మెంట్ లభిస్తోందని ఈ నివేదిక వెల్లడించింది. దీనివల్ల క్రియేటర్ల పాపులారిటీతో పాటు వారి సంపాదన కూడా పెరుగుతోంది. ప్రస్తుతానికి భారతీయ యూజర్లు ఎక్కువగా ఇష్టపడుతున్న కేటగిరీలలో బ్యూటీ అండ్ మేకప్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ఫిట్నెస్, కామెడీ మరియు స్పోర్ట్స్ వీడియోలు టాప్లో ఉన్నాయి. ముఖ్యంగా ఈ-కామర్స్, ఆటోమొబైల్ (కార్లు, బైకులు),ఫైనాన్షియల్ సర్వీసెస్ (బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్స్) రంగాలకు చెందిన కంపెనీల ప్రొడక్ట్స్ను ప్రమోట్ చేయడానికి రీల్స్ ఇప్పుడు ఒక పవర్ఫుల్ అస్త్రంగా మారిపోయాయి.
ప్రకటన
ప్రకటన