ఇటీవలి కాలంలో కొందరు కేటుగాళ్లు కొన్ని యాప్స్ ఉపయోగించి ఈ-రిక్షాలు, ఇతర ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలను దూరం నుంచే డిస్కనెక్ట్ చేస్తున్నట్లు ప్రభుత్వ విచారణలో తేలింది.
Photo Credit: Pexels/Keith Lobo
EV Battery Management Apps
Apps Ban : స్మార్ట్ఫోన్ యాప్స్ ద్వారా నడిరోడ్డుపై వెళ్తున్న ఈ-రిక్షాల బ్యాటరీలను రిమోట్గా బంద్ చేస్తున్నారనే వార్తలపై కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలకు దిగింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ఆధారంగా ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) రంగంలోకి దిగింది. గూగుల్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్, యాపిల్ ఐఓఎస్ యాప్ స్టోర్లకు అధికారిక నోటీసులు జారీ చేసింది. ప్రజల భద్రతకు, జీవనోపాధికి ముప్పుగా మారిన 7 బ్యాటరీ మేనేజ్మెంట్ యాప్లను తమ ప్లాట్ఫారమ్ల నుండి తక్షణమే తొలగించాలని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
యాప్ నొక్కితే కారు, రిక్షా ఆగిపోతున్నాయ్
ఇటీవలి కాలంలో కొందరు కేటుగాళ్లు కొన్ని యాప్స్ ఉపయోగించి ఈ-రిక్షాలు, ఇతర ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలను దూరం నుంచే డిస్కనెక్ట్ చేస్తున్నట్లు ప్రభుత్వ విచారణలో తేలింది. కేంద్రం నిషేధించిన ఈ యాప్స్లో BAT-BMS, SMART BMS, LOSSIGY వంటి ప్రముఖ యాప్లు ఉన్నాయి. కేవలం బ్లూటూత్ కనెక్టివిటీ ఆధారంగా ఈ యాప్లు వాహనాల్లోని బ్యాటరీ సిస్టమ్తో అనుసంధానమై, వాటి పవర్ అవుట్పుట్ను నిలిపివేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఒకవేళ భవిష్యత్తులో కూడా ఇటువంటి మోసాలకు లేదా రిమోట్ తారుమారుకు సహకరించే యాప్లు కనిపిస్తే, వాటిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం గట్టి హెచ్చరికలు జారీ చేసింది.
చీప్ బ్యాటరీల వల్లే ఈ ముప్పు ఎందుకు వస్తోంది?
సాధారణంగా బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ (BMS) యాప్లను బ్యాటరీ వోల్టేజ్, కరెంట్, ఛార్జింగ్ స్థాయి, ఉష్ణోగ్రత వంటి ముఖ్యమైన విషయాలను గమనించడానికి డిజైన్ చేస్తారు. అయితే, తక్కువ ధరలో లభించే నాసిరకం బ్యాటరీ ప్యాక్లలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణంగా మారింది. ఇటువంటి బ్యాటరీలలో ఎలాంటి పాస్వర్డ్ ప్రొటెక్షన్ లేదా సరైన అథెంటికేషన్ లేకుండానే బ్లూటూత్ యాక్సెస్ లభిస్తుంది. దీనిని ఆసరాగా చేసుకుని మూడో వ్యక్తి ఎవరైనా సరే, అదే ఇంటర్ఫేస్ సాయంతో బ్యాటరీ డిశ్చార్జ్ కాకుండా దూరం నుండే పవర్ సప్లైని ఆపేస్తున్నారు.
Vivo : మార్కెట్లోకి వీవో సరికొత్త సంచలనం.. అదిరిపోయే ఫీచర్లతో వస్తోన్న Vivo X300e
జీవనోపాధి దెబ్బతింటోందని ఈ-రిక్షా డ్రైవర్ల ఆవేదన
ఈ వింత హ్యాకింగ్ ఘటనల వల్ల దేశవ్యాప్తంగా ఉన్న ఈ-రిక్షా డ్రైవర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చాలా మంది డ్రైవర్లు కారు లేదా రిక్షాలను అద్దెకు తీసుకుని నడుపుతుంటారు. రోజూ వచ్చే సంపాదనతోనే వారు రిక్షా కిరాయి కట్టడంతో పాటు తమ ఇళ్లను గడుపుకోవాలి. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలలో, వాహనాలు నడిరోడ్డుపై అకస్మాత్తుగా ఆగిపోవడంతో డ్రైవర్లు గంటల తరబడి ఎటూ వెళ్లలేక ఇరుక్కుపోయిన దృశ్యాలు కనిపించాయి. ఇది వారి రోజువారీ సంపాదనను దెబ్బతీయడమే కాకుండా ప్రయాణికుల భద్రతను కూడా ప్రమాదంలో పడేసింది.
సైబర్ భద్రతపై నిఘా పెంచిన కేంద్రం
ప్రస్తుత పరిస్థితిని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ చాలా నిశితంగా పరిశీలిస్తోంది. ఇటువంటి భద్రతా లోపాలు ఉన్న మరికొన్ని యాప్లపై కూడా విచారణ జరుపుతున్నారు. గూగుల్, యాపిల్ వంటి గ్లోబల్ యాప్ ప్లాట్ఫారమ్లు కనెక్టెడ్-డివైజ్ యాప్స్ను తమ స్టోర్లలో అనుమతించే ముందు స్క్రీనింగ్ ప్రక్రియను మరింత కఠినతరం చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇటువంటి యాప్స్ ప్రజా భద్రతకు, సామాన్యుల ఆర్థిక వనరులకు పెద్ద ముప్పుగా పరిణమించే అవకాశం ఉన్నందున, భవిష్యత్తులో కఠినమైన గైడ్లైన్స్ తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ప్రకటన
ప్రకటన
Vivo X Fold 6 India Launch Could Be Much Later Than Usual, Price Range Leaked